2 నుండి 4: ఇదీ జగన్ సాక్షి చరిత్ర!.. రేవంత్ నోట జఫా
గుంటూరు జిల్లా సాక్షి కార్యాలయం పైన దాడి విషయంలో టిడిపి కార్యకర్తల పైన విమర్శలు గుప్పించడాన్ని ఆయన ఖండించారు. నాలుగేళ్లుగా సాక్షి పత్రిక చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా రాసినా టిడిపి ఎప్పుడూ దాడి చేయలేదన్నారు. గుంటూరులో సాక్షి కార్యాలయం నుండి తమ పార్టీ నేతలపై జగన్ పార్టీ కార్యకర్తల రాళ్ల దాడి, గుడ్ల దాడికి ప్రతిస్పందనగానే అది జరిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. అవసరమనుకుంటే ఈ ఘటనపై విచారణ చేపట్టాలన్నారు.
జర్నలిస్టులు అంటే తమకు ఎంతో గౌరవం అన్నారు. దాడుల చరిత్ర వైయ జగన్ కుటుంబానిదే అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆ రెండు పత్రికలు చదువొద్దని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. షర్మిల, అంబటి రాంబాబులకు తమ పార్టీ అధ్యక్షుడిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తమ తీరు కుసంస్కారం అని షర్మిల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కుసంస్కారం అంటే ఏమిటో ఆమె చెప్పాలన్నారు.
35 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని విమర్శించడం, కెసిఆర్, టిడిపి నేతలను కాళ్లు పట్టుకోమని అడగడం, అవినీతికి పాల్పడ్డ జగన్ను జైలు నుండి విడిపించుకో వచ్చేందుకు తమ పార్టీపై బురద జల్లడం, ఆపరేషన్ పైన నివృత్తి చేయాలని అడిగితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కుసంస్కారం కాదా? అని ప్రశ్నించారు. జగన్కు చెందిన ప్రతి అంశాన్ని పెద్దగా ఇచ్చే సాక్షి ఆమె గాయంపై ఎందుకు అంత స్థాయిలో రాయలేదో చెప్పాలన్నారు.
అంబటి రాంబాబు గురించి మాట్లాడితే తన స్థాయిని తానే దిగజార్చుకున్నట్లన్నారు. ఆయన గురించి ప్రసార సాధనాల్లో ఎప్పుడూ చూస్తూనే ఉన్నామన్నారు. టిడిపి కార్యాలయం ముందు ధర్నా జర్నలిస్టులు చేసి ఉంటే వారు తమ పద్దతిని మార్చుకోవాలన్నారు. అలా చేస్తే వారిని జగన్ అనుచరులుగానే భావించాల్సి ఉంటుందన్నారు. టిడిపి లక్ష్యంగా సాక్షి పని చేస్తోందన్నారు. జర్నలిస్టులు జగన్ కోసం పని చేయడం మానుకోవాలని హితవు పలికారు.
సాక్షిది అబద్దాల పుట్టుక
సాక్షిది అబద్దాల పుట్టుక అని మండిపడ్డారు. కలర్ ఫుల్ పేజీలతో అందరికంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పిన జగన్ రెండు రూపాయల నుండి ఇప్పుడు నాలుగు రూపాయలు చేశారన్నారు. అవినీతి జగన్ను బయటకు తీసుకు వచ్చేందుకు తప్పుడు రాతలు, అబద్దాలు రాస్తోందన్నారు. సాక్షిలో పని చేసే జర్నలిస్టులు చిల్లరమల్లర పనులు చేయవద్దని హితవు పలికారు. హైకోర్టు న్యాయమూర్తిపై తప్పుడు కథనాలు సాక్షి రాసిందని గుర్తు చేశారు.
దాడులు మా సంస్కృతికాదు
దాడులు టిడిపి సంస్కృతి కాదన్నారు. రౌడీషీటర్ మనువడి పార్టీ వైయస్సార్ కాంగ్రెసు అని నిప్పులు చెరిగారు. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆంధ్రజ్యోతి దిన పత్రిక కార్యాలయాలపై దాడి చేసిన సంస్కృతి ఆ పార్టీది అన్నారు. సాక్షి జర్నలిస్టుల తీరు ఇలాగే ఉంటే వారిని జర్నలిస్టులుగా గౌరవించేది లేదన్నారు. జర్నలిస్టుల ముసుగులో టిడిపి పైకి ఉసిగొల్పవద్దన్నారు. రౌడీషీటర్ మనుడైన జగన్ అవినీతి సొమ్ముతో పార్టీని స్థాపించాడన్నారు.