ముప్పేట దాడి, ఆందోళనలు ఉధృతం: కోదండరామ్
గవర్నర్ ప్రసంగం ఈ ప్రాంతంపై వివక్షకు గుర్తుగా మిగిలిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందని, జనవరిలో ఓ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి వెనక్కితగ్గటం వల్ల 13 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని, దీనిపై స్పందించలేదని, ఆత్మహత్యలు వద్దని కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదని ఆయన విమర్శించారు.
తెలంగాణ రైతులు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్ కోతల మీద కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదని, 22 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నందున సడక్ బంద్ వేళలను కుదించామన్నారు. సడక్ బంద్ను 21న ఉదయం ప్రారంభించి సాయంత్రం 7గంటలకు ముగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
బలిదానాలను ఆపటానికి, తెలంగాణను సాధించుకోవటానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా సడక్బంద్లో పాల్గొనాలని కోరారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రవేశపెట్టనున్న అవిశ్వాసతీర్మానాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వినియోగించాలన్నారు. లేకపోతే ప్రజాకోర్టు ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో కేంద్ర నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, వారు సమస్యలను పరిష్కరించే శక్తిని కోల్పోయినట్లు భావిస్తున్నట్లు కోదండరాం వ్యాఖ్యానించారు.
వారిది తప్పుడు ప్రచారం : నాయని
పరీక్షలవేళ సడక్బంద్ ఏమిటని కొందరు తప్పుడుప్రచారం చేస్తున్నారని తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంత కాంగ్రెస్, టిడిపి నేతలు తెలంగాణవాదులైతే సడక్ బంద్లో పాల్గొనాలని, లేకపోతే ప్రజలు వారి భరతం పడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ నేత కె.గోవర్దన్, జేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్గౌడ్, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్, కోదండలకు సమన్లు
ఇదిలావుంటే, తెరాస అధినేత కె.చంద్రశేఖర్రావు, జేఏసీ చైర్మన్ కోదండరాం ఏప్రిల్ 4న కోర్టుకు హాజరుకావాలని విశాఖ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సూర్యారావు గురువారం ఆదేశాలు జారీచేశారు.