అమెరికా తీర్మానానికి భారత్ మద్దతు, పాక్ వ్యతిరేకం
అమెరికా తీర్మానానికి భారత్ మద్దతిచ్చింది. మరోవైపు మన దాయాది దేశం పాకిస్తాన్ తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి భారత్ ఎలాంటి సవరణలను ప్రతిపాదించలేదు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టిటిఈ) లక్ష్యంగా శ్రీలంక సైన్యం చేసిన దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే.
ఎల్టిటిఈ అణచివేత పేరిట శ్రీలంక సైన్యం చేసిన అరాచకాలపై మానవ హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని అమెరికా ప్రవేశ పెట్టింది. దీనిని భారత్ సమర్థించింది. ఐక్య రాజ్య సమితికి చెందిన అమెరికా రాయబారి ఎలీన్ చాంబెర్లియన్ ఈ తీర్మానాన్ని ఐక్య రాజ్య సమితి కౌన్సిల్లో ప్రవేశ పెట్టాడు.
కాగా, శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం, సైన్యం చర్యలకు గట్టిగా సమాధానం చెప్పాలని భారత దేశంలో నాలుగు రోజులుగా వేడి రాజుకున్న విషయం తెలిసిందే. అమెరికా తీర్మానంలో కొన్ని సవరణలు చేయాలని డిఎంకె పట్టుబట్టింది. ఈ గొడవ డిఎంకె కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించే వరకు వెళ్లింది.