తూచ్!: ఓడినా ఓకే.. మజ్లిస్తో పొత్తుపై తలసాని ట్విస్ట్

దీనిపై తలసాని శుక్రవారం మాట్లాడారు. మజ్లిస్ పార్టీకి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. నగర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఓడినా ఫరవాలేదని కానీ, మజ్లిస్ అభ్యర్థికి మద్దతిచ్చే ప్రసక్తి మాత్రం లేదని తేల్చి చెప్పారు. తమ పార్టీలోని మైనార్టీ నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే విద్యుత్ కోతలు భారీగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు రేపు విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.
మజ్లిస్కు మద్దతుపై తగ్గడం వెనుక...
నగర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థికి టిడిపి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా అన్నట్లు గురువారం రేవంత్ రెడ్డి తదితర టిడిపి నేతలు మజ్లిస్ నేతలతో భేటీ అయ్యారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా తలసాని మజ్లిస్కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెప్పడం చర్చనీయాంశమయింది.
టిడిపిలో ఓ వర్గం మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా మరికొందరు సిద్ధంగా ఉండి ఉండక పోవచ్చునని అంటున్నారు. అలాకాకుండా మజ్లిస్ పార్టీ సాధారణ ఎన్నికల నాటికి జగన్కు దూరంగా జరిగే హామీ ఇచ్చి ఉండక పోవచ్చునని చెబుతున్నారు. ఇంకోవైపు టిడిపిలోని మైనార్టీ నేతలు పలువురు సీనియర్ నేతలను కలిసి తమకు టిక్కెట్లు ఇవ్వాలని, మజ్లిస్తో పొత్తు వద్దని సూచించినట్లుగా కూడా చెబుతున్నారు.
దానం సెటైర్
మజ్లిస్ పార్టీ అభ్యర్థికి టిడిపి మద్దతిస్తానని చెప్పడం అనైతికమని మంత్రి దానం నాగేందర్ అన్నారు. గతంలోలాగే మజ్లిస్ - టిడిపి మధ్య స్నేహ పూర్వక ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా, కాంగ్రెసు పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఎస్ ప్రభాకర్ పేరును ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications