జగన్ను ఏమైనా అని ఉంటే.. ఇక అండగా ఉంటా: జోగి
అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. తాను జగన్ పార్టీలో ఆలస్యంగా చేరుతున్నందుకు చాలా బాధపడుతున్నానని అన్నారు. గతంలో తాను జగన్ పైన ఆరోపణలు చేసి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తన రాజకీయ గురువు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. వైయస్ కుటుంబం పైన రాజకీయ సాధింపులు చూడలేకే తాను కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చినట్లు చెప్పారు.
అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఆయనను జైలుకు పంపించేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉండి తాను టిడిపి, కాంగ్రెస్ ఒక్కటైన విషయాన్ని గమనించానని చెప్పారు.
అవిశ్వాసం సందర్భంగా తన ఆత్మసాక్షిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని చెప్పారు. కష్టాల్లో, బాధల్లో ఉన్న వైయస్ జగన్ కుటుంబానికి తాను ఇప్పుడు అండగా ఉంటానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి వైయస్ జగన్ ఆధ్వర్యంలో తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.