క్షమాభిక్ష కోరను, లొంగిపోతా: సంజయ్ దత్ కంట నీరు
తాను క్షమాభిక్ష పిటిషన్ను వేయడం లేదని చెప్పారు. సుప్రీం కోర్టులో తాను లొంగిపోతానని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంజయ్ దత్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కోర్టులపై తనకు పూర్తిగా నమ్మకముందని చెప్పారు. సంజయ్ దత్ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కలచివేసింది.
కాగా, సంజయ్ దత్కు క్షమాభిక్ష పెడితే తాను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన విషయం తెలిసిందే. సంజయ్ దత్కు క్షమాభిక్ష పెట్టవద్దని, అదే జరిగితే తాను కోర్టులో సవాల్ చేస్తానని ఆయన అన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆయన శిక్ష అనుభవించాలన్నారు. మరోవైపు బిజెపి వంటి ప్రధాన ప్రతిపక్షం కూడా సంజయ్ దత్కి క్షమాభిక్షను వ్యతిరేకిస్తోంది.
సంజయ్ దత్కు ఐదేళ్ల శిక్ష పడిన రోజే ఆయన సోదరి, ఎంపి ప్రియాదత్ కూడా ఏడ్చారు. ప్రియా దత్ సుప్రీం కోర్టులోనే కంట తడి పెట్టారు. సంజయ్ దత్ న్యాయస్థానం ఐదేళ్ల శిక్ష విధిస్తున్నట్లు చెప్పగానే ఆమె ఒక్కసారిగా ఏడ్చారు. అనంతరం తీర్పుపై స్పందిస్తూ.. తీర్పుతో ప్రతి ఒక్కరు అప్ సెట్ అయ్యారని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పుపై ఆమె అభిప్రాయం కోరగా తాను ఇప్పుడు ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. వెంటనే అక్కడు నుండి విషణ్ణ వదనంతో కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆమె ముంబయి కాంగ్రెసు ఎంపిగా ఉన్నారు.