శ్రీలంక తమిళులు: కరుణానిదిపై జయలలిత పైచేయి
చెన్నై: శ్రీలంక తమిళుల సమస్యపై డిఎంకె అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పైచేయి సాధించారు. శ్రీలంకలో తమిళుల సమస్యపై, ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ సవరణలు సూచించే విషయంపై యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని తమిళ ప్రజల హృదయాలను ఆకట్టుకోవాలని కరుణానిధి ప్రయత్నించారు. కానీ, జయలలిత ఆయన పాచికలను పారనీయలేదు.
శ్రీలంక తమిళుల సమస్యకు తానే ఛాంపియన్ అని చాటుకోవడానికి ఆమె వేగంగా పావులు కదిపారు. అందుకు అనుగుణమైన వ్యూహాలు ఆనుసరిస్తూ తన ఆధిక్యతను సాధించుకున్నారు. యుపిఎలో తన అన్నాడియంకె భాగస్వామి కాకపోవడం, తమిళనాడులో అధికారంలో ఉండడం ఆమెకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇదే సమయంలో తన కుమారులు అళగిరి, స్టాలిన్ మధ్య వివాదం మరోసారి తెర మీదికి రావడం కరుణానిధిని ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి.
శ్రీలంక తమిళుల విషయంలో కరుణానిధి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కూడా ఆమె ధ్వజమెత్తారు. శ్రీలంక తమిళ ఈలం కోసం రెఫరెండం నిర్వహించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసిన సందర్బంగా జయలలిత కరుణానిధిపై విరుచుకుపడ్డారు. ఐపియల్ మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు ఉండడమనే అంశాన్ని జయలలిత వివాదంగా మార్చి ఆ విషయంలో కరుణానిధి మీద పైచేయి సాధించారు.

చైన్నైలో జరిగే ఐపియల్ మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు, అంపైర్లు, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటే ఆడనిచ్చేది లేదని చెబుతూ ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. ఆమె లేఖతో ఒక్కసారిగా పరిస్థితి తిరగబడింది. సాఫీగా సాగుతుందని భావించిన ఐపియల్పై పిడుగు పడినట్లయింది. చెన్నై నుంచి మ్యాచులను తరలించే బదులు చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు లేకుండా చూసుకుంటే సరిపోతుందని ఓ నిర్ణయానికి వచ్చిన ఐపియల్ పాలక మండలి ఆ మేరకు చర్యలు చేపట్టింది.
ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి తీసుకున్న ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లను తప్పించింది. అయితే, కరుణానిధి మనవడు మారన్కు చెందిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తమిళ ఆటగాళ్లు ఉండడాన్ని జయలలిత సరైన సమయంలో ఎత్తి చూపారు. శానససభలో కరుణానిధి తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. శ్రీలంక తమిళుల విషయంలో కరుణానిధి ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నారని జయలలిత విమర్శించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కుమార సంగక్కర, తిషారా పెరేరా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. దీన్ని బట్టి ఆమె కరుణానిధిని ఎండగట్టడానికి పక్కా ప్రణాళికతో ఉన్నట్లు అర్థమవుతోంది. మొత్తం మీద, శ్రీలంక తమిళుల కోసం జరుగుతున్న పోరాటంలో కరుణానిధిపై జయలలిత తన ఆధిక్యతను చాటుకున్నారు.












Click it and Unblock the Notifications