బొడ్డుకు జగన్ చేయి?: మురళీ మోహన్పై జయప్రద!
తనయుడికి రాజమండ్రి లోకసభ టిక్కెట్ ఇస్తానని జగన్ చెప్పినందువల్లే బొడ్డు ఆ పార్టీలో చేరారట. అప్పటికే మరో నేత కూడా అదే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వీరిద్దరికి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె జగన్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆమె రాజమండ్రి నుండి మాత్రమే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
యుపికి గుడ్ బై చెప్పి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నప్పటి నుండి రాజమండ్రి నుండి మాత్రమే పోటీ చేస్తానని జయప్రద చెబుతున్నారు. రాజమండ్రి టిక్కెట్ కోసమే ఆమె అన్ని పార్టీలు తిరిగి చివరకు జగన్ పార్టీ వైపుకు వెళ్లారనే వాదనలు కూడా ఉన్నాయి. టిడిపిలో, కాంగ్రెసులో రాజమండ్రి టిక్కెట్ కోసం రాయి వేసిన జయప్రద ఇప్పుడు జగన్ పార్టీ నుండి టిక్కెట్ పైన హామీ రావడంతోనే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై పొగడ్తలు, జగన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
బొడ్డు, ఇతర నేతల కంటే గ్లామర్ టచ్ ఉన్న జయప్రద అయితేనే బాగుంటుందని జగన్ భావిస్తే మాత్రం బొడ్డుకు షాక్ తగిలినట్లే అంటున్నారు. జయప్రద పొగడ్తలు, రాజమండ్రిపై పట్టు చూస్తుంటే ఇప్పటికే హామీ వచ్చి ఉంటుందని అంటున్నారు. జగన్ పార్టీలో జయప్రద చేరుతారా? రాజమండ్రి నుండి పోటీ చేయిస్తారా? అనే అంశం కొద్ది రోజుల్లో తేలిపోనుంది. జయప్రదకే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టిడిపి తరఫున పోటీ చేస్తున్న మురళీ మోహన్తో ఆమె సై అన్నట్లే. కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, టిడిపి నుండి మురళీ మోహన్, వైయస్సార్ కాంగ్రెసు నుండి జయప్రదలు పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని మరింత ఆకర్షిస్తుంది.