వైయస్: ఆనం ఫ్యామిలీలో చిచ్చు, జగన్ పార్టీలోకి జయ

తమ కుటుంబం వైయస్ వల్లే రాజకీయంగా ఎదిగిందని, దేవుడిలాంటి ఆయనను, ఆయన కుటుంబాన్ని తమ సోదరుడు ఇలా విమర్శిస్తారని అనుకోలేదని, తనకు రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పించాయని జయకుమార్ రెడ్డి అన్నారు. వైయస్తో తమకు రాజకీయ సంబంధం మాత్రమే కాకుండా తమ కుటుంబాన్ని ఆయన తన సొంత కుటుంబంలా చూసుకున్నారని చెప్పారు. తమను సొంత తమ్ముళ్లలా చూసుకున్నారన్నారు.
వైయస్ ఉండగా ఆయనను పొగిడిన తమ సోదరులు ఇప్పుడు విమర్శించడం సరికాదన్నారు. వైయస్ అంతటి వాడు జగనేనని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసింది మొదట ఆనం సోదరులే అని గుర్తు చేశారు. ఆ తర్వాత వాళ్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం తప్పు కాదు కానీ, వైయస్ కుటుంబాన్ని విమర్శించడం తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు.
ఆనం జయకుమార్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి ఆయన జగన్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారట. అతను రెండు మూడు రోజుల్లో జైల్లో ఉన్న జగన్ను కలుసుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
శత్రువే మిత్రుడా?
ఆనం కుటుంబానికి రాజకీయ వైరం ఉన్న భక్తవత్సల రెడ్డి తనయుడు వెంకటరమణ రెడ్డి ఇప్పుటికే జగన్ పార్టీలో చేరారు. జయకుమార్ రెడ్డి కూడా ఇప్పుడు అదే పార్టీలో చేరనున్నారు. ఆనం సోదరులతో పడని వెంకటరమణ రెడ్డి మొదట టిడిపిలో ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టాక ప్రజారాజ్యం వైపు వెళ్లారు. ఇప్పుడు జగన్ వైపుకు వెళ్లారు. ఇప్పుడు అదే పార్టీలో జయకుమార్ రెడ్డి చేరుతారనే ప్రచారం సాగుతుండటంతో జిల్లాలో ఇది చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications