జగన్కు లక్ష్మీపార్వతి గతే: వైయస్పై మళ్లీ పేలిన సర్వే
ఆయన పార్టీకి లక్ష్మీపార్వతి పార్టీ గతే పడుతుందన్నారు. లక్ష్మీపార్వతి సభలకు జనాలు వచ్చినా ఓటు వేయలేదన్నారు. జగన్ పార్టీ పరిస్థితి అంతే అన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ఉన్నారన్నారు. కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేసినట్లేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
వైయస్ కుటుంబంపై పేలిన సర్వే
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై సర్వే సత్యనారాయణ మళ్లీ పేలారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు తన కొడుక్కు దోచి పెట్టారని నిప్పులు చెరిగారు. వైయస్ కుటుంబ సభ్యులు కూనీకోర్లు, దగాకోర్లు అన్నారు. జగన్ తాను దోచుకున్న డబ్బును రాష్ట్ర ప్రజానికానికి పంచిపెడితే కష్టాలు తీరుతాయన్నారు.
సీమాంధ్ర ప్రజలను ఒప్పించి...
ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ తెలంగాణ అంశంపై స్పందించారు. సీమాంధ్ర ప్రజలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ అక్కడి ప్రజల ఆకాంక్ష అన్నారు.
సోనియాకు జిందాబాద్
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక సదస్సును సర్వే సత్యనారాయణ ఎన్నికల ప్రచార సభగా మార్చివేశారు! ఆయన మాట్లాడటానికి ముందు సోనియా గాంధీ జిందాబాద్ అంటూ నినాదం చేశారు. సర్వే జై అనగానే అక్కడున్న మిగతా కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా సోనియాకు, కాంగ్రెసుకు జై కొట్టారు.