'చాయ్ అమ్మిన నరేంద్రమోడీ: టీచర్లతో గొడవకి దిగేవాడు'
మోడీ తన చిన్నతనంలో చాయ్ అమ్మారట. ఆయనకు ఆరేళ్ల వయసున్నపుడు తన తండ్రి దామోదరదాస్ నడిపే ఓ టీ కొట్టు నుంచి మోడీ చాయ్ తీసుకు వెళ్లి రైల్వే స్టేషన్లో అమ్మేవారని పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకాన్ని వెస్ట్ల్యాండ్ లిమిటెడ్ ముద్రించింది. యువకుడిగా ఉన్న నాటి నుంచి వరుసగా మూడుసార్లు గుజరాత్లో ప్రభుత్వాన్ని నెలకొల్పిన నేతగా ఎదిగిన మోడీకి సంబంధించి అరుదైన ఛాయా చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇందులో మోడీ చదువుకున్న బిఎన్ హైస్కూల్ టీచర్ ప్రహ్లాద్భాయ్ జి పటేల్ గతాన్ని గుర్తు చేసుకుంటూ "విద్యార్థిగా ఉన్నపుడు మోడీని హోంవర్క్ చూపించమంటే టీచర్కు మాత్రమే చూపిస్తాననేవాడు. క్లాస్ లీడర్కు మాత్రం చూపించనని మొండికేసేవాడు. టీచర్ల మాట వినకుండా గొడవకు దిగేవాడు'' అని వెల్లడించారు. మరోవైపు మోడీ సాధారణ విద్యార్థిగా ఉన్నా, తోటి విద్యార్థుల సమస్యలను ప్రిన్సిపల్ వద్దకు వెళ్లి ధైర్యంగా చెప్పేవారనీ, క్రమశిక్షణలో కచ్చితంగా ఉండేవారనీ ఆయన బాల్య స్నేహితుడు సుధీర్ జోషి పేర్కొన్నారు.
మోడీ బాల్యం నుంచీ వస్త్రధారణ విషయంలో కఠినంగా ఉండేవాడనీ, ఇతర చిన్నారుల్లాగా నలిగిపోయిన దుస్తులు ధరించేందుకు ఇష్టపడకపోయేదనీ ఆయన మామ జయంతి భాయ్ చెప్పారు. వీటన్నిటితోపాటుగా ఆర్ఎస్ఎస్, బిజెపితో మోడీ పెనవేసుకున్న అనుబంధం పైనా ఈ పుస్తకంలో రచయిత అనేక విషయాలను ప్రస్తావించారు. బాల్యంలో చాయ్ అమ్మినపుడు మోడీ నివసించిన ఇల్లు అచ్చం రైల్వే బోగీలా చిన్నగా ఉండేదని రచయిత తెలిపారు.