రాజధానిలో గెలిచిన తెలంగాణవాదం: విక్రంపై హరీష్ విన్
తెరాస అనుబంధ సంఘమైన కామ్గార్ యూనియన్ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే టి.హరీశ్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అనుబంధ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పోటీ చేసిన మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్పై 98 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
జల మండలిలో నాలుగు పర్యాయాలుగా విజయం సాధిస్తూ వచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ ఈసారి పరాజయం పాలైంది. జల మండలి ఎన్నికల్లో మొత్తం 3,959 మంది ఓటర్లు ఉండగా 3,784 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో హరీశ్కు 1547 ఓట్లు పోలవగా విక్రమ్ గౌడ్కు 1449 ఓట్లు పోలయ్యాయి.
మజ్లిస్ బలపరిచిన సంఘం తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే బలాల, టిడిపి బలపరిచిన సంఘం తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి డిపాజిట్లను కోల్పోయారు. హైదరాబాద్లో తెలంగాణవాదం గెలిచిందని, ఇక్కడ తెలంగాణవాదం లేదని అనే వారికి ఈ విజయం చెంప పెట్టు అని హరీశ్ వ్యాఖ్యానించారు.