కన్నడనాట ప్రచారానికి కిరణ్: వాగ్దానం లేదన్న రాహుల్
ఈ దశలో మరింత లబ్ధి కోసం అధిష్టానం పలువురు ముఖ్య నేతలను కర్నాటక ప్రచారనికి ఆఖరు సమయంలో పంపించేందుకు సిద్ధమైందట. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల పాటు కర్నాటకలో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఈ నెల 30, మే 1వ తేదీల్లో అతను తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారట. కేంద్రమంత్రి చిరంజీవి తదితరులు కూడా ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే.
కాగా, కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పాలనను దుయ్యబట్టారు. ఐదేళ్ల బిజెపి పాలనలో కర్నాటక ప్రజలకు ఏర్పడినగాయాలను మాన్పేందుకు కాంగ్రెసుకు పట్టం కట్టాలని అన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల హక్కుల కోసం పోరాడతామన్నారు. రాహుల్ తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఐదేళ్లుగా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను హింసించిందన్నారు. ప్రజలు విశ్వసించడంతో గత ఎన్నికల్లో బిజెపి గెలిచిందని, అప్పట్లో ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్ధానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని ఆరోపించారు. వాళ్లకు తెలిసింది కర్నాటక ప్రజల ధనాన్ని ఎలా దోచుకోవాలనే తప్ప మరొకటి లేదన్నారు. ఢిల్లీలో అవినీతి గురించి మాట్లాడే బిజెపి అధినేతలు కర్నాటకలో ఐదేళ్లుగా జరిగిన దానికి ఏం సమాధానం చెబుతారన్నారు. తాము వాగ్దానాలు చేయడం లేదని గాయాలు మాత్రం మాన్పుతామని, ప్రజల కోసం పోరాడుతామన్నారు.