బెదిరేది లేదు: కెసిఆర్కు రాధాకృష్ణ ధీటైన సమాధానం
సాధారణంగానే నిజాలు గుర్తించేందుకు రాజకీయ నాయకులు ఇష్టపడరని, కెసిఆర్ లాంటి వారు అసలు ఇష్టపడరని, నియంతృత్వ పోకడలకు అలవాటుపడిన కెసిఆర్ తన చర్యలను వ్యతిరేకించిన వారిని తెలంగాణ ద్రోహులుగా, సీమాంధ్రకు తొత్తులుగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తారని, తమ విమర్శలకు వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్న కెసిఆర్ తిట్ల పురాణం అందుకున్నారని ఎద్దేవా చేశారు. వ్యతిరేకంగా మాట్లాడితే సీమాంధ్ర మీడియా అనడం ఆనవాయితీగా మారిందన్నారు.
తెలంగాణ ఉద్యమం వ్యాప్తి చెందడానికి ఆ సీమాంధ్ర మీడియానే ఉపయోగపడిందనే విషయాన్ని ఆయన గుర్తించాలని హితవు పలికారు. తన తప్పులను ఎవరు ఎత్తిచూపకుండా ఉండేందుకు కెసిఆర్ తెలంగాణవాదాన్ని కవచంగా వాడుకుంటుంటారని, తనను, తెరాసను విమర్శిస్తే తెలంగాణను వ్యతిరేకించినట్లుగా ఆయన ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తారని, తెలంగాణవాదం అంటే కెసిఆర్ను, తెరాసను భుజానికెత్తుకోవడం కాదని, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటే చాలన్నారు.
తెలంగాణవాది అనిపించుకునేందుకు కెసిఆర్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. తెలంగాణ రావాలంటే మొదట ఉద్యమం అన్న కెసిఆర్ తర్వాత లాబీయింగ్ అన్నారని ఇప్పుడు ఓట్లు సీట్లు అంటున్నారని, అసలు తెలంగాణ రావాలంటే బిజెపిని బలపర్చాలని అభిప్రాయపడ్డారు. తెరాసను గెలిపిస్తే కేవలం పోరాడుతుందని, బిజెపిని గెలిపిస్తే తెలంగాణ ఇస్తుంది కదా అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు తెరాస వైపు చూడటం రాజకీయ లబ్ధి కోసమే అన్నారు.
అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అంటూ కెసిఆర్ మాట్లాడి తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని, స్వతంత్ర సమరం జరిగినప్పుడు ఆత్మహత్యలు జరగలేదని, ఎందుకంటే నాటి నాయకులు కెసిఆర్లా కల్లిబొల్లి మాటలు చెప్పలేదన్నారు. ఉద్యోగాల విషయంలోను వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన త్యాగాలేమీ లేవన్నారు. వారి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. తప్పులు ఎత్తి చూపడం మా బాధ్యత అని చెప్పారు. కెసిఆర్ సంకుచిత రాజకీయల అవకాశవాదానికి జాతీయవాదం అర్థం కాదన్నారు.