చిరంజీవి, చంద్రబాబు వల్లే వెనక్కి వెళ్లింది: కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించి కేంద్రం వెనక్కి వెళ్లిందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరంజీవి అయోమయం సృష్టించారని అందుకే కేంద్రం వెనక్కి వెళ్లిందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని ఇటీవల తనను ఢిల్లీకి పిలిచారని, పార్టీని విలీనం చేయాలని కోరారని, తర్వాత మాట్లాడలేదని, ఎందుకు వెనక్కి వెళ్లారో తెలియదని ఆయన అన్నారు.
బిజెపి తెలంగాణ నినాదంతో బరిలోకి దిగితే తెరాస దెబ్బ తినదా అని అడిగితే - తెలంగాణ కోసమే ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరికి ఓటు వేయాలో కూడా ప్రజలకు తెలుసుని, నరేంద్ర మోడీ హవా ఉంటుందన్నది కూడా నిజం కాదని, 1984 ఎన్నికల్లో ఇందిరా గాంధీ హత్యానంతర సానుభూతి కన్నా కుట్రతో పదవీచ్యుతుడైన ఎన్టీ రామారావు పట్ల సానుభూతే బాగా పనిచేసిందని ఆయన అన్నారు.
మొండిగా పరుగెత్తాలని అనడాన్ని తాను వ్యతిరేకిస్తానని, హింసావిధ్వంసం సరి కాదని తాను చెప్పాని, అయితే చాలా మంది కెసిఆర్ సర్కస్ చేస్తే బాగుండు, కెసిఆర్ డ్రామా వేస్తే బాగుండు అని కూడా చెప్తారని, కానీ ఎవరో చెప్పారని తాను సర్కస్ చేస్తే తెలంగాణ ఉద్యమం సర్కస్ అవుతుందని, తమ వ్యూహం ప్రకారమే వెళ్తుంటామని ఆయన అన్నారు.
తమకు ఆంధ్ర పార్టీల పెత్తనం వద్దని, ఇదే నినాదంతో జనంలోకి వెళ్తున్నామని, తెలంగాణ పార్టీకే పట్టం కట్టాలని కోరుతున్నామని, అందరిపై తమ రాజకీయ దాడి ఒకేలా ఉంటుందని, ఎవరినీ వదిలిపెట్టబోమని కెసిఆర్ అన్నారు.
కవిత గ్రామాలకు వెళ్తే బతుకమ్మ వస్తోందని...
తెరాస కుటుంబ పార్టీ అనే విమర్శలకు కెసిఆర్ సమాధానం ఇచ్చారు. ఒకే రోజు తన కొడుకు, బిడ్డ, అల్లుడు అందరూ జైల్లో ఉన్నారని, వారు ఉద్యమంలో మమేకమయ్యారని ఆయన చెప్పారు. హరీష్ రావు తెరాస వ్యవస్థాపక సభ్యుడని, తన బిడ్డ కవిత సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేస్తోందని, కవిత గ్రామాలకు వెళ్తే తమ బతుకమ్మ వస్తోందనీ ఆడబిడ్డ వస్తోందని ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. రాజకీయ నేత తండ్రి కావడమే పిల్లలకు శాపంగా మారాలా అని ఆయన అడిగారు. ఎవరి అభిరుచిని బట్టి వారు వస్తారని, వారు ఇప్పుడు ఉద్యమంలో ఉన్నారని, రాజకీయాల్లోకి రావడమన్నది చిన్న విషయమేనని ఆయన అన్నారు.