టి-ఎంపీలపై సోనియా సానుభూతి: జయప్రద పరామర్శ
మొదటి రోజు దీక్షను ఎవరు పట్టించుకోలేదు. రాత్రి దీక్షా ప్రాంగణంలోనే ఎంపీలు పడుకున్నారు. ఏర్పాట్లు కూడా వారే స్వయంగా చేసుకున్నారు. తొలి రోజున పార్టీ సీనియర్లెవరూ దీక్షను పెద్దగా పట్టించుకోనప్పటికీ మంగళవారం మాత్రం కొంతమంది అగ్రనేతలు, ఇతర పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి దీక్షా శిబిరానికి వచ్చారు. కుర్చీ తెప్పించుకొని ఇరవై నిమిషాలు దీక్షలో పాల్గొన్నారు. అంబికా సోనీ, గిరిజావ్యాస్, విప్ సందీప్ దీక్షిత్, కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ వారిని పరామర్శించారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాతో పాటు పలువురు ఎంపీలు మద్దతు తెలిపారు.
కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీలు కావూరి సాంబశివ రావు, బొత్స ఝాన్సీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టిడిపి ఎంపీ గుండు సుధారాణి, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ, తెరాస నేత వినోద్ కుమార్, సినినటి జయప్రద వారి యోగక్షేమాలు విచారించారు.
రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు ఎంపీలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. కాగా, దీక్షలో ఉన్న పార్లమెంటు సభ్యులకు అసౌకర్యం కలగకుండా చూడాలని పార్లమెంటు అధికారులను స్పీకర్ మీరాకుమార్ ఆదేశించారు. వారి దీక్ష ఈ రోజు పది గంటలకు ముగియనుంది.