ఎగ్జిట్ సర్వే: కర్ణాటక హస్తగతం, వాడిన కమలం
న్యూఢిల్లీ: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలను బట్టి తెలుస్తోంది. రెండోసారి కూడా అధికారాన్ని దక్కించుకోవాలన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆశలు వమ్ము కానున్నాయని ఆదివారం పోలింగ్ అనంతరం టీవీ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని టీవీ చానళ్లు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కాంగ్రెస్కు 110కి పైగా స్థానాలు, బిజెపికి దాదాపు 50 స్థానాలు దక్కుతాయని చెప్పడం విశేషం. కాంగ్రెస్కు 110నుంచి 116 దాకా స్థానాలు వస్తాయని, బిజెపికి 43 నుంచి 53 స్థానాల మధ్య వస్తాయని సిఎన్ఎన్- ఐబిఎం అంచనా వేసింది.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లాంటి మారిన పరిస్థితుల కారణంగా మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ నేతృత్వంలోని జెడి (ఎస్)కు కూడా బిజెపితో సమానంగా 43 నుంచి 53 సీట్ల మధ్య రావచ్చని ఆ చానల్ అంచనా వేసింది. మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప పార్టీ సహా ఇతరులకు 16 నుంచి 24 స్థానాల మధ్య రావచ్చని తెలిపింది.
కాంగ్రెస్ 114 స్థానాలు దక్కించుకుని కొద్దిపాటి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకోవచ్చని హెడ్లైన్స్ టుడే చానల్ తెలిపిది. బిజెపికి 55 సీట్లు, జెడి (ఎస్)కు 34 స్థానాలు దక్కవచ్చని, యెడ్యూరప్ప పార్టీకి 11 సీట్లు, ఇతరులకు 9 స్థానాలు రావచ్చని కూడా చానల్ తెలిపింది.
ఇదిలావుంటే, హిందీ చానల్ ఎబిపి న్యూస్ కాంగ్రెస్కు 110నుంచి 118 స్థానాలు రావచ్చని, బిజెపికి 51 నుంచి 59 దాకా సీట్లు రావచ్చని అంచనా వేసింది. జెడి (ఎస్)కు 31 నుంచి 37 దాకా, యెడ్యూరప్ప పార్టీకి 9 నుంచి 13 సీట్ల రావచ్చని కూడా అంచనా వేసింది. ‘టైమ్స్ నౌ' చానల్ మాత్రం కాంగ్రెస్కు భారీ మెజారిటీ వస్తుందని, ఆ పార్టీకి 132 స్థానాలకు రావచ్చని చెప్పడం విశేషం.
కాగా, బిజెపి, జెడి (ఎస్)లు చెరో 32 స్థానాలతో మూడో స్థానానికి పరిమితం అవుతాయని కూడా చానల్ అంచనా వేసింది. యెడ్యూరప్ప పార్టీ సహా ఇతరులకు 15 సీట్లు వస్తాయని చానల్ తెలిపింది. మొత్తం మీద, బిజెపి కర్ణాటకలో భారీగా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిలో పడింది.