నిమ్మగడ్డకి చుక్కెదురు: లొంగిపోవాలని సాయికి ఆదేశం
నిమ్మగడ్డకు బెయిల్ ఇస్తే సాక్ష్యలను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆయన కూడా కీలకమని, కేసు కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ కోర్టులో వాదించింది. సిబిఐ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. నిమ్మగడ్డకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా కేసును నాలుగు ఐదు నెలల్లో పూర్తి చేసి తుది ఛార్జీషీటును దాఖలు చేయాలని సిబిఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.
మరోవైపు జగన్ ఆడిటర్, ఈ కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలన్న సిబిఐ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. జూన్ 5వ తేదిలోగా లొంగిపోవాలని సుప్రీం సాయిని ఆదేశించింది. గతేడాది అతనికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో సిబిఐ సుప్రీం కోర్టు గడపను తొక్కింది.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్కు బెయిల్ వస్తుందని పార్టీ ఆసక్తితో ఎదురు చూస్తోంది. అయితే, నిమ్మగడ్డకు బెయిల్ రాకపోవడం, విజయ సాయి రెడ్డికి బెయిల్ రద్దు చేయడంతో జగన్కు బెయిల్ రాదని అందరూ భావిస్తున్నారు.