విషాదం: పెళ్లి అవుతుందనగా వరుడి ఆత్మహత్య
కాలనీకి చెందిన కొండపల్లి సురేంద్ర(22)తో పెదకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన యువతికిచ్చి వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తెనాలి చెంచుపేటలోని ఆర్సిఎం చర్చిలో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పెళ్లి పిలుపు అందుకుని బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరూ వరుని ఇంటికి చేరుకున్నారు. అప్పటి వరకు వారితో కలిసి మెలిసి వున్న సురేంద్ర ఉన్నట్లుండి గదిలోకి వెళ్లి ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిద్ర వస్తోందని చెప్పి గదిలోకి వెళ్లిన సురేంద్ర ఎంతకూ తిరిగి బయటకు రాక పోవడంతో బంధువులు, స్నేహితులు తలుపు గడియ తొలగించి చూడగా సురేంద్ర ఉరి వేసుకుని కనిపించాడు. ఒక ఇంటివాడు అవుతాడనుకున్న కొడుకు శవంగా మారడంతో తల్లిదండ్రులు సుందరరావు, అన్నపూర్ణ కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులు ఊహించని ఈ పరిణామాన్ని తట్టుకోలేక కంట తడి పెట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సురేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి ఇష్టం లేకనే సురేంద్ర ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమతో మాట మాత్రంగా కూడా పెళ్లి ఇష్టం లేదనే ప్రస్తావన తీసుకు రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.