గోతిలో పడి గిలగిల, మా బాధేంటి?: మంత్రులపై షర్మిల
జగన్ కేసులో మంత్రుల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. 26 జివోలపై కోర్టు నోటీసులు ఇస్తే కాంగ్రెసు ప్రభుత్వం, మంత్రులు సమాధానమివ్వలేదని ఆరోపించారు. జివోలతో సంబంధం లేని జగన్ను జైలుకు పంపుతుంటే వీరంతా మౌనంగా ఉండిపోయారని, ఇప్పుడు వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారన్నారు. ఇప్పుడు ఆ జీవోలు అన్ని సక్రమమేనని ఒప్పుకుంటున్నారని విమర్శించారు. వారికి ఉచ్చు బిగిసుకోగానే మంత్రులు గిలగిల కొట్టుకుంటున్నారన్నారు.
నేరం రుజువు కాకుండా తమను కళంకిత మంత్రులు ఎలా అంటారని వారు ప్రశ్నిస్తున్నారని, మరి ఏ కోర్టు చెప్పకుండానే జగన్ను దోషి అని అంటే మాకు బాధ కలగదా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. ఆయన అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఓ రోజు మాట్లాడుతూ.. బాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే లేడన్నారని, అసలు సిసలు అవినీతిపరుడు ఆయనేనని, నిస్సిగ్గుగా ఢిల్లీకి వెళ్లి ఇక్కడ అవినీతి గురించి మాట్లాడుతున్నారన్నారు. తనపై విచారణలు, కేసులు జరగకుండా ఉండేందుకు చీకట్లో చిదంబరాన్ని కలిశారన్నారు.