కూతురి కుట్ర.. విషపు రొట్టెలు.. ప్రియుడితో పరార్!
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మురేనా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోర్సా ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి పారిపోయేందుకు కన్నవారి ప్రాణాలనే పణంగా పెట్టింది. ప్రేమలో గుడ్డిదైపోయిన ఆ కూతురు.. తన తల్లిదండ్రులకు విషం కలిపిన ఆహారాన్ని తినిపించి చంపడానికి ప్రయత్నించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత మార్చి 28న ఈ కుట్రకు బీజం పడింది. సదరు బాలిక తన ప్రియుడు సుదామాతో కలిసి పారిపోవాలని నిశ్చయించుకుంది. ఇంట్లో తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని భావించిన ఆమె, వారిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా తన ప్రియుడికి ఫోన్ చేసి ఎలుకల మందు తెప్పించింది. ఆ విషాన్ని రొట్టెల్లో కలిపి ఏమీ తెలియనట్లుగా తన తల్లిదండ్రులకు వడ్డించింది.

ఆ విషపూరితమైన ఆహారం తిన్న కొద్దిసేపటికే దంపతులిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. ఆ మైనర్ బాలిక ఇంట్లోని నగదు, సామాగ్రితో కలిసి తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అదృష్టవశాత్తూ ఇతర కుటుంబ సభ్యులు వారిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. గ్వాలియర్లో మెరుగైన చికిత్స అందడంతో వారు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఏప్రిల్ 2న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఓ ఆడియో క్లిప్ లభ్యమైంది. అందులో బాలిక తన ప్రియుడితో విషం ఎప్పుడు తేవాలి, ఆహారంలో ఎలా కలపాలి అనే విషయాల గురించి మాట్లాడుతున్న భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ ఆడియో సాక్ష్యాల ఆధారంగా పోలీసులు బాలిక, ఆమె ప్రియుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications