ఆర్టీసీలో మెట్రో స్టైల్.. బస్సు ఎక్కక ముందే టికెట్! ఇక మీ సేవ యాప్లో కూడా
బస్సుల్లో ప్రయాణం అంటే ఉదయాన్నే రద్దీ, కండక్టర్ 'చిల్లర ఇవ్వండి' అనడం, ఆపై జేబుల్లో కాయిన్స్ కోసం వెతుక్కోవడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. వీటితో పాటు మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కూడా అమలువుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్ లో ఆర్టీసీ బస్సులో విపరీతమైన రష్ ను మనం ఎదుర్కుంటున్నాం. చాలా సార్లు కండక్టర్ మన కాళ్లు తొక్కుకుంటూ టికెట్ ఇవ్వడానికి వెళ్తున్న ఇబ్బందికర పరిస్థితులను కూడా చూశాం.
అయితే, ఈ రోజువారీ తిప్పలకు త్వరలోనే చెక్ పడనుంది. హైదరాబాద్ నగర రవాణాను సరికొత్త డిజిటల్ బాట పట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. మెట్రో రైలు తరహాలోనే.. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని 'మీ టికెట్' (Mee Ticket) యాప్ రూపంలో అందుబాటులోకి తెస్తోంది.

ఈ కొత్త విధానంతో రద్దీ సమయాల్లో బస్సుల్లో నిలబడి, ఊపిరి ఆడని జనం మధ్య కండక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ మొబైల్ యాప్లో ఎక్కే బస్ స్టాప్, దిగే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ముందే చెల్లింపులు చేయవచ్చు. టికెట్ బుక్ అవ్వడమే కాకుండా, బస్సు ప్రస్తుతం ఎక్కడుందో లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ సమయానికి డిజిటల్ ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ వంటి సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం.
ఈ సదుపాయం రావడం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కండక్టర్లపై పనిభారం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ నగరంలో తిరిగే 3200కు పైగా బస్సుల్లో సుమారు 26 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఇప్పటికే 23 శాతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. విద్యార్థులకు కూడా త్వరలో డిజిటల్ బస్ పాస్లు రానుండటంతో గ్రేటర్ ఆర్టీసీ సేవలు మరింత సున్నితంగా, వేగవంతంగా మారనున్నాయి.
అయితే ఆర్టీసీ సొంతంగా ఎలక్ట్రిక్ ఆటోలను నడపబోతోందనే వార్తలను యాజమాన్యం స్పష్టంగా ఖండించింది. ప్రయాణికులను సురక్షితంగా, డిజిటల్ హంగులతో తమ గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ ఈ అడ్వాన్స్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది.














Click it and Unblock the Notifications