జగన్కు ఛాన్స్: వైయస్ స్కీమ్స్కు కిరణ్ రంగు(పిక్చర్స్)
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి 'పథకాల' రూపంలో ఆయుధాన్ని అందించారు. తాము గతంలో కంటే ఎక్కువ పథకాలు ప్రారంభించామని, వైయస్ రాజశేఖర రెడ్డి సమయంలోని పథకాలు తమ పథకాలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెసు నేతలు మొదటి నుండి చెబుతున్నారు.
దానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీటుగానే స్పందిస్తోంది. వైయస్ హయాం నాటివి కాంగ్రెస్ పథకాలే అయితే మిగతా కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలుకావడం లేదని, వైయస్ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని, వైయస్ పేరు లేకుండా చేసేందుకు ఆ పథకాల స్థానంలో కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నారని, అవి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది.
వైయస్ హయాం పథకాలు తమ పథకాలేనని కిరణ్ ప్రభుత్వం చెబుతూనే.. పాత పథకాలను నిర్వీర్యం చేసి కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అవి నిజమేనన్నట్లుగా డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం పథకాల గుట్టును విప్పారు. కొన్ని కొత్త పథకాలు ఉన్నాయని చెబుతూనే... బంగారు తల్లి పథకం 2005లో వైయస్ ప్రవేశ పెట్టిన లక్పతి పథకం కంటే గొప్పగా ఉందా అని ప్రశ్నించారు. వైయస్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఉద్యోగశ్రీని తన పేరుతో రాజీవ్ యువకిరణాలుగా మార్చుకున్నారని మండిపడ్డారు.
బంగారు తల్లి పథకంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి గతంలోనే కామెంట్ చేశారు. బంగారు తల్లి గత పథకాన్ని పోలి ఉందని చెప్పారు. పలువురు కాంగ్రెసు నేతలు కూడా 'వైయస్ పథకాలకు కిరణ్ రంగు' పూస్తున్నారని గుసగుసలు పెట్టుకుంటున్నారట. అయితే ఈ డిఎల్ అంశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చేదే అంటున్నారు. తమ వాదన నిజమని మరోసారి రుజువైందని జగన్ పార్టీ చెప్పుకోవచ్చునని అంటున్నారు.
వైయస్ కొన్ని పథకాలకే కిరణ్ తన రంగు పులుముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలను నిర్వీర్యం చేయడమే కాకుండా కొన్ని పథకాలకు పేర్లు మార్చుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చాలా రోజులుగా ఆరోపిస్తోంది.
వ్యక్తిగత విభేదాల వల్లనో, మరో కారణం వల్లనో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు పార్టీ నేతలు గతంలోను దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి.
కాంగ్రెసు పార్టీ నేతల నుండి దొర్లుతున్న తప్పులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు.
జగన్ కాంగ్రెసులోనే ఉంటే ఏదైనా పదవి వచ్చేదని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఆజాద్ వ్యాఖ్యను ఉప ఎన్నికలలో అస్త్రంగా ఉపయోగించుకున్న వైయస్సార్ కాంగ్రెసు.. ఆ తర్వాత పలుమార్లు దానిని గుర్తు చేసింది.
సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి శంకర రావు కామెంట్స్ కూడా జగన్ పార్టీకి అస్త్రంగా ఉపయోగపడ్డాయి. జగన్ను మాత్రమే జైలులో ఉంచి మంత్రులను బయట ఉంచడంపై ఆయన పలుమార్లు మాట్లాడారు.
ఇప్పుడు డీఎల్ రవీంద్రా రెడ్డి పథకాలపై కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని కొన్ని పథకాలకు కిరణ్ తన రంగు పులుముకుంటున్నారని ఆరోపించారు.