ఎపిపిఎస్సీ: ఓ గ్రామంలో దాక్కున్న కిలాడీ సంధ్యా అరెస్ట్
ఆరోపణలు వచ్చినప్పటి నుండి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ఐదు రోజులుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సంధ్యా రాణిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆమెకు ఈ నెల 24వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు.
ఆ వెంటనే పోలీసులు సంధ్యా రాణిని చంచల్గూడలోని మహిళా జైలుకు తరలించారు. సంధ్యను కస్టడీలోకి తీసుకొని మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాలని సిసిఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమెను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇప్పటికే జరిపిన విచారణలో ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే కుమారుడి ద్వారా ఎపిపిఎస్సీ సభ్యుడు సీతారామరాజు తనకు పరిచయం అయ్యారని సంధ్య పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీతారామరాజు హామీ మేరకే తాను నిరుద్యోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆమె చెప్పారని సమాచారం. హైదరాబాదులోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పరిచయం చేసుకొని, అలా నిరుద్యోగులను పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంధ్య పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.