ఓటు జగన్ విడుదలకు మార్గం: షర్మిల, యాత్ర రికార్డ్
రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్, టిడిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యపడుతుందన్నారు. తమను ఆశీర్వదించాలని, ఆశీస్సులివ్వాలని ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని, మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధమని, తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కృషి చేయాలని కోరుతున్నామన్నారు.
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 199వ రోజు గురువారం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సెంటర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, శీలానగర్, ఎయిర్పోర్టు, ఎన్ఏడీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, ఏటీ జంక్షన్ మీదుగా షర్మిల నడిచారు. కంచరపాలెం మెట్ట వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు.
గురువారం మొత్తం ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,652.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల చేపట్టిన యాత్ర శుక్రవారానికి రెండు వందల రోజులను పూర్తి చేసుకోనుంది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో షర్మిల ఈ రోజు అడుగుపెట్టడంతో వంద నియోజకవర్గాలు కూడా పూర్తి చేసుకుంటుంది.