ఆ ముగ్గురికి పిలుపు: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో భరోసా
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై తమ వైఖరిని తేల్చేందుకు సిద్ధపడిందని మరింత స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. గత వారంలో కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలే కాకుండా, రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణపై తేల్చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ, సమైక్యాంధ్రలపై రోడ్ మ్యాప్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలను అధిష్టానం ఆదేశించింది.
ఈ రోడ్ మ్యాప్తో ఈ నెల 12, 13 తేదీల్లో తమకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వారిని ఆదేశించారు. దామోదర, బొత్సలు రోడ్ మ్యాప్తో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తాను ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని బొత్స ఈ రోజు చెప్పారు. కిరణ్ కూడా రోడ్ మ్యాప్తో సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. 12, 13 తేదీల్లో అందుబాటులో ఉండాలని డిగ్గీ ఆదేశించడంతో ఈ నెల శుక్రవారం జరగాల్సిన సిఎల్పీ భేటీ వాయిదా పడింది.

రోడ్ మ్యాప్ పరిశీలించాకే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని డిగ్గీ చెప్పారు. అయితే అధిష్టానం మాత్రం ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నదని అంటున్నారు. నేతల రోడ్ మ్యాప్ నామమాత్రమే అంటున్నారు. అధిష్టానం విషయంలో పార్టీలకతీతంగా ఇరు ప్రాంతాలకు చెందిన అందరు నేతలు ఆసక్తిగా, టెన్షన్గా ఉన్నారు. అయితే ఒక్క తెలంగాణ కాంగ్రెసు నేతల్లో మాత్రం ఎలాంటి సంకోచం లేనట్లుగా కనిపిస్తోంది. టి కాంగ్ నేతల్లో అధిష్టానం మరోసారి మోసం చేస్తుందన్న భావన ఏ కోశాన కనిపించడం లేదనే చెప్పవచ్చు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అనంతరం రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తామని సోనియా చెప్పారని, 12న కోర్ కమిటీ సమావేశమై చర్చిస్తుందని, ఆ తర్వాత ఓ నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. హైదరాబాదుతో కూడి పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేస్తామని అధినేత్రి చెప్పారన్నారు. మిగిలిన టి కాంగ్రెసు నేతల్లోను అదే ధీమా కనిపిస్తోందని చెప్పవచ్చు.
అయితే కాంగ్రెసును మాత్రం తెలంగాణ ఇతర రాజకీయ పార్టీలు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలు నమ్మడం లేదు. కాంగ్రెసు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు నమ్మే పరిస్థితి లేదని కోదండరామ్ చెప్పారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు కూడా అదే విధమైన అభిప్రాయంతో ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెసు నేతల్లో ధీమా కనిపిస్తుండగా, తెలంగాణకు చెందిన ఇతర పార్టీలు మాత్రం నమ్మడం లేదు.
ఇక సీమాంధ్రలో పార్టీలకతీతంగా అందరిలోనూ టెన్షన్ నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఈ నెల 12న కోర్ కమిటీ ఏం చర్చిస్తుంది? ఆ తర్వాత ఏం ప్రకటన చేస్తుంది? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తే ఏం చేయాలనే అంశంపై సీమాంధ్ర కాంగ్రెసు నేతలు తర్జన భర్జన పడుతున్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కూడా ప్రకటన తదనంతర పరిణామాలపై అంతర్గతంగా జోరుగా చర్చిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications