విడగొడితే ప్రాణత్యాగం: శ్రీకాంత్, జగన్ పార్టీ వల్లే: బొత్స
గతంలో రెండుసార్లు అందరి నుండి అభిప్రాయాలను సేకరించిన కాంగ్రెసు తెలంగాణ విషయంలో తన అభిప్రాయాన్ని ఇంతవరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. విభజన విషయంలో తాము ప్లీనరీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే రాయలసీమను విభజిస్తే మాత్రం ఊరుకోమని, రాజీనామాలకే కాకుండా ప్రాణత్యాగాలకు సైతం సిద్దమన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వల్లే: బొత్స
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించాకనే రాజకీయాల్లో నీతి, నిజాయితీలు తుడిచి పెట్టుకుపోయాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తెలంగాణ విభజన అంశం చారిత్రకమైనదన్నారు. దీనిని పంచాయతీ వంటి చిన్న అంశాలతో కాంగ్రెసు ముడిపెట్టదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను నక్సల్స్ అంశంతో ముడిపెట్టనని చెప్పారు.
తెలంగాణ ఖాయం: డిఎస్
తెలంగాణ ఏర్పాటు ఖాయమని మాజీ పిసిసి అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్ మంగళవారం అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయి ఇరు ప్రాంతాల ప్రజలం ప్రేమాభిమానాలతో ఉందామన్నారు. తెలంగాణలో సెటిలర్లకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల లోపే తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.