రూలర్ తర్వాత బాలకృష్ణ, యూత్ టార్గెట్గా నారా లోకేష్
బాబు దారిలోనే హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ, యువనేత నారా లోకేష్లు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారట. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న రూలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాను సాధారణ ఎన్నికలకు ముందు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని భావిస్తున్నారట.
ప్రస్తుతం షూటింగులో బిజీగా ఉన్న బాలయ్య అది పూర్తవగానే ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో యాత్ర చేయాలని భావిస్తున్నారట. ఆయన అన్ని జిల్లాలను చుట్టి వచ్చేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కొంతకాలం క్రితం వరకు పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అయితే బాబు పాదయాత్ర తర్వాత మారింది. బాబు బస్సు యాత్రతో మరింత మారుతుందని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాలకృష్ణ యాత్ర.. ఆ తర్వాత ప్రచారంలోకి దిగితే తెలుగుదేశానికి తిరుగుండదని భావిస్తున్నారు. మరోవైపు కేవలం యువతే లక్ష్యంగా నారా లోకేష్ కూడా ఓ యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. అవినీతి, పాలన పైన యువతలో రాజకీయ చైతన్యం కలిగించాలని లోకేష్ ఈ యాత్ర చేపడుతున్నారట.