5లోపే తెలంగాణపై నిర్ణయం: అఖిల పక్ష భేటీకి నో

తెలంగాణపై రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందే దాని అమలు విధివిధానాలపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చేందుకు అధిష్ఠానం కసరత్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.. సిడబ్ల్యుసి సభ్యులకు అన్ని అంశాలపై స్పష్టత వచ్చేలా ఒక విధాన నిర్ణయ ప్రకటనను రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజధాని ప్రతిపత్తి, సీమాంధ్రుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి తీసుకోబోయే చర్యలను వివరించే అవకాశం కనిపిస్తోంది.
వచ్చేనెల 5వ తేదీలోపే సిడబ్ల్యుసి భేటీ ఉంటుందని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. శుక్రవారం కోర్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సిడబ్ల్యుసి అజెండాను తదుపరి కోర్కమిటీ భేటీలో ఖరారు చేస్తామని తెలిపారు.
సిడబ్ల్యుసి భేటీ 28న జరుగుతుందా? అని ప్రశ్నించగా... 'వచ్చే వారం మీకు తెలుస్తుంది కదా!' అని బదులిచ్చారు. ఈనెల 28వ తేదీనే తెలంగాణపై సిడబ్ల్యుసి భేటీ జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అందుకు రెండు రోజుల ముందే ఢిల్లీ చేరుకుని, మరోమారు అధిష్ఠానం పెద్దలను కలిసి సమైక్యవాదాన్ని బలంగా వినిపించాలని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications