అడకత్తెరలో: వెనక్కెళ్తే అదే దార్లో టి నేతలు, ఢిల్లీకి డిఎస్
చివరి నిమిషంలో వెనక్కి పోకుండా ఉండే ప్రయత్నాల్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు నివాసంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. సీమాంధ్ర నేతలు అడ్డుకునే ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించారు.
సహకరించండి: టి నేతలు
అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరుతున్న క్షణంలో సీమాంధ్ర నేతలు పెద్దన్న పాత్ర పోషించి విభజనకు సహకరించాలని కాంగ్రెసు పార్టీ ఎంపీలు కోరుతున్నారు. విభజనను అడ్డుకోవద్దని ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు విజ్ఞప్తి చేశారు. విడిపోయి కలిసుందామన్నారు.
ఢిల్లీకి ముఖేష్, దానం, సాయంత్రం డిఎస్
హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో రాజధానికి చెందిన మంత్రులు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్లు ఢిల్లీకి బయలుదేరారు. మాజీ పిసిసి అధ్యక్షుడు, శాసన సభ్యుడు డి శ్రీనివాస్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. సిఎల్పీలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్ తదితరులు భేటీ అయ్యారు.
బిల్లు పెట్టే వరకు నమ్మం: హరీష్ రావు
కాంగ్రెసు పార్టీని బిల్లు పెట్టే వరకు తాము నమ్మే పరిస్థితి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. కాంగ్రెసు పార్టీ తన నిర్ణయం ప్రకటించినా, ఎలాంటి తెలంగాణ ఇస్తుంది, హైదరాబాదును ఏం చేస్తారనే అంశాన్ని తాము పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న తెలంగాణ ఇస్తే తాము స్వాగతిస్తామన్నారు.
రాజీనామాలు చేస్తామనలేదు: సీమాంధ్ర నేతలు
తాము రాజీనామాలు చేస్తామని చెప్పలేదని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు.