సమస్యలన్నింటికి కారణమే మీరు!: కిరణ్పై దామోదర
టిజెఎప్ మీట్ది ప్రెస్లో దామోదర కిరణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణకు ఎప్పుడు ఆభ్యంతర పెట్టలేదని, ఇప్పుడు ఇలా మాట్లాడటం శోచనీయమన్నారు. కాంగ్రెసు పలు సందర్భాలలో తెలంగాణపై హామీ ఇచ్చిందని, ఇది అరవై ఏళ్ల కల అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైన సమయంలో ముఖ్యమంత్రి ఇలా చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ అన్నారు.
ఉద్యమం తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిందన్నారు. తెలంగాణ కంటే దేశంలో ఇంకా 18 చిన్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదని, ఇతరుల భూభాగం తీసుకోవడం లేదన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్యమాల పురిటి గడ్డలు అన్నారు. హైదరాబాదుకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కులీకుతుబ్ షా, ఆసిఫ్ జాహీలు పాలించారని, తెలంగాణకు గొప్ప పోరాట చరిత్ర, సంస్కృతి ఉందన్నారు. నిజాంలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణదన్నారు.
తాము 1999లోనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ కోసం లేఖ ఇచ్చామన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులను ఇక్కడి నుండి పొమ్మనే హక్కు ఎవరికి, ఏ పార్టీకి లేదన్నారు. రాజ్యాంగబద్ధంగా అందరికీ దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులు సెటిలర్స్ కాదని, హైదరాబాదీలు, తెలంగాణ ప్రజలే అన్నారు. సమైక్యాంధ్రలో అరవై వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రజలు నష్టపోయారని చెప్పారు.
1972లో జై ఆంధ్ర అన్న వారు ఇప్పుడు సమైక్యాంధ్ర ఎందుకంటున్నారని ప్రశ్నించారు. నదీ జలాలు, విద్యుత్, విద్య తదితర సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. సమైక్యవాదం పట్ల తెలంగాణ ప్రజలకు అనుమానాలున్నందునే రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రం ఆస్తులు, వ్యాపారం కోసమా అని ప్రశ్నించారు. తమకు కావాల్సింది ఆత్మగౌరవం, స్వయంపాలన అన్నారు. అదిష్టానాన్ని ధిక్కరిస్తే చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమన్నారు.
నేను అంటే అహంకారం, మనం అంటే మమకారం అవుతుందని, నేను అంటే ఓటమికి, మనం అంటే విజయానికి సోపానమన్నారు. అధిష్టానం వల్లే మనం ఈ స్థాయికి వచ్చామని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు కలిసి పండుగలు జరుపుకుంటాయన్నారు. తెలంగాణ కల సాకారమవుతున్న నేపథ్యంలో అందరికి కృతజ్ఞతలు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మేధావుల సలహాలు తీసుకుంటామన్నారు.