మమతకు బంగ్లాదేశ్ ఝలక్ ? ఓడిపోయిన 48 గంటల్లోనే యూటర్న్..!
ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అంటే ఇదే. నిన్న మొన్నటి వరకూ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అండగా నిలిచి, బీజేపీ నేతృత్వంలోని కేంద్రంతో వైరం కొనసాగించిన బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం .. ఇప్పుడు మమత ఓడిపోగానే రూటు మార్చేసింది. ఓ కీలక అంశంలో బీజేపీపై నమ్మకం ప్రకటించడంతో పాటు మమత తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ఇదంతా చూస్తున్న బెంగాల్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
బెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఓడిపోయి, బీజేపీ గెలవడంపై బంగ్లాదేశ్ అధికార పార్టీ బీఎన్పీ స్పందించింది. బీజేపీకి అభినందనలు తెలిపింది. ఈ గెలుపు రాష్ట్రంతో తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న టీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ సాధించిన విజయాన్ని కొనియాడిన బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బారీ హెలాల్.. రెండు దేశాల మధ్య టీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని అడ్డుకుంటున్నారని మమతా బెనర్జీని విమర్శించారు.

టీస్తా బ్యారేజీ ఒప్పందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వాలు రెండూ గట్టి మద్దతు ఇచ్చాయని హెలాల్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చినందున, సువేందు అధికారి నాయకత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీస్తా నదీ జలాల వివాదం భారత్, బంగ్లాదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యలలో ఒకటి. 1996 గంగా జలాల ఒప్పందం ఫరక్కా బ్యారేజీ వద్ద పొడి కాలంలో నీటి పంపిణీని నియంత్రిస్తుంది. అయితే, తక్కువ నీటి విడుదలతో దిగువ ప్రాంతాలలోని వ్యవసాయం, జీవనోపాధి దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది. వాతావరణ మార్పులతో తగ్గుతున్న నీటి లభ్యత కూడా ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.

1996 ఒప్పందం ఈ ఏడాది చివరిలో ముగుస్తున్నందున బంగ్లాదేశ్ టీస్తా జలాలలో న్యాయబద్ధమైన వాటాను ఆశిస్తోంది. అయితే బెంగాల్ తన నీటి అవసరాలను పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని నిరంతరం వ్యతిరేకిస్తోంది. 2011లో ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటనలో ఒక ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం, బంగ్లాదేశ్కు 37.5 శాతం, భారతదేశానికి 42.5 శాతం టీస్టా జలాలు కేటాయించాలని. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో అది ముందుకు సాగలేదు. అంతకు ముందు 1983లో టీస్తా జలాలపై తాత్కాలిక ఒప్పందం జరిగింది. దీని కింద బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం వాటా నిర్ణయించగా, మిగిలిన 25 శాతం తర్వాత నిర్ణయించాలని ఉద్దేశించారు. అయితే, ఈ ఏర్పాటు పూర్తిగా అమలు కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ 2015లో ఢాకా పర్యటన కూడా న్యాయమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా పాత విభేదాలను పరిష్కరించవచ్చని ఆశలు రేపింది. అయినా ఇప్పటికీ పరిష్కారం లేదు.















Click it and Unblock the Notifications