ఫోటోలు: నరేంద్ర మోడీ సభ: ఈ హంగులు, భారీ భద్రత
హైదరాబాద్: బిజెపి ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పార్క్ హయత్ హోటల్లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఎల్బీ స్డేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాదులోని నారాయణగుడాలో గల కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. నరేంద్ర మోడీ హైదరాబాద్ కార్యక్రమాలను బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శనివారం ప్రకటించారు.

మోడీ సభపైనే: వెంకయ్య
దేశం యావత్తు రేపు(ఆదివారం) హైదరాబాద్లో జరిగే నరేంద్ర మోడీ సభ వైపే చూస్తోందని, బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అవినీతి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెంకయ్య చెప్పారు. శనివారం ఉదయం ఎల్బీ స్టేడియంలో మోడీ సభ ఏర్పాట్లను వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డి తదితరులు పరిశీలించారు. దేశం ఎదుర్కుంటున్న సవాళ్లు, వాటికి సమాధానాలు, ప్రత్యామ్నాయ ఎజెండానే ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రసంగంలో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ సభ దక్షిణ భారతదేశంపై కీలకమైన ప్రభావం చూపుతుందని, దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు.

స్వామి వివేకానంద ప్రాంగణంగా నామకరణం
సభ ఏర్పాట్లును వెంకయ్యనాయుడు సహా దత్తాత్రేయ, జి. కిషన్ రెడ్డి, సిహెచ్ విద్యాసాగరరావు శనివారం పర్యవేక్షించారు. ఎల్బీ స్టేడియాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు వేల మందిని భద్రత నిమిత్తం నియోగించారు. మోడీ ప్సంగాన్ని వీక్షించేందుకు సభకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని మైదానం లోపల, వెలుపల మొత్తం 12 ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నారు. మైదానం నుంచి ఎటువైపు చూసినా కన్పించేలా వాటిని ఏర్పాటు చేశారు. భారీగా ప్రధాన వేదిక సిద్ధమైంది. సభ జరిగే ఎల్బీ స్టేడియానికి స్వామి వివేకానంద ప్రాంగణంగా నామకరణం చేశారు.

మహిళలకు ప్రత్యేక ద్వారాలు
సభా ప్రాంగణంలోకి వెళ్లడానికి మహిళల కోసం ప్రత్యేకంగా రెండు ద్వారాలను ఏర్పాటు చేశారు. స్టేడియానికి ఉన్న ముఖద్వారాలకు రాణి రుద్రమదేవి, శ్రీకష్ణ దేవరాయలు పేర్లు పెట్టారు. స్డేడియం నుంచి మైదానంలోకి వెళ్లే నాలుగు ద్వారాలకు షోయబుల్లా ఖాన్, రామనంద తీర్థ, అల్లూరి సీతారామారాజు, కొమురం భీము అని నామకరణం చేశారు.

విఐపి, వివిఐపి ద్వారాలుండవు
సభకు వచ్చేవారందరినీ సమానంగానే చూడాలని బిజెపి నిర్ణయించుకుంది. దీంతో వివిఐపి, విఐపి ద్వారాలను ఏర్పాటు చేయలేదు. స్టేడియం సామర్థ్యానికి మించి యువత హాజరవుతారని, దీన్ని దృష్టి పెట్టుకుని నిజాం కళాశాల మైదానంలో భారీ తెరను ఏర్పాటు చేశారు. పబ్లిక్ గార్డెన్స్లోకూడా ఓ ఎల్ఈడి తెరను ఏర్పాటు చేస్తున్నట్లు బిజెపి నాయకులు చెప్పారు.

ఇంటర్నెట్లలో ప్రత్యక్ష ప్రసారం
సభకు హాజరు కాలేనివారిని దృష్టిలో పెట్టుకుని రెండు వెబ్సైట్లలో మోడీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. చివరి రోజు కూడా పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రాంగణం లోపల 20 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications