మోడీ స్పీచ్: తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ ఆసక్తి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోదని అన్ని రాజకీయ పార్టీలతో పాటు బిజెపి కూడా భావిస్తూ వచ్చింది. దాంతో తెలంగాణలో నరేంద్ర మోడీ సభ తమ పార్టీకి ఊపును ఇస్తుందని బిజెపి నాయకులు భావించారు. తెలంగాణలోని కొన్ని కీలకమైన లోకసభ స్థానాలను లక్ష్యం చేసుకుని మోడీ పర్యటన ద్వారా ఊపు తెచ్చుకోవాలని భావించారు. కానీ, అనూహ్యంగా మోడీ సభకు ముందే తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో మోడీకి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తగిన విషయం లేదని భావిస్తూ వస్తున్నారు.
బిజెపి అనుకూల వైఖరి వల్ల సీమాంధ్ర ప్రజలు ఆ పార్టీపై కొంత వ్యతిరేకతతోనే ఉన్నారని చెప్పాలి. ఈ స్థితిలో ఇరు ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడానికి నరేంద్ర మోడీ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. సీమాంధ్రలో మూడు నాలుగు, తెలంగాణలో ఐదారు లోకసభ స్థానాలను గెలుచుకునేందుకు వీలైన వ్యూహరచనను బిజెపి చేసుకుంది. అందుకు అనుగుణంగా మోడీ తన ప్రసంగ వ్యూహాన్ని రూపు దిద్దుకోవాల్సి ఉంటుంది.
అయితే, నరేంద్ర మోడీ చాలా వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా తన ప్రసంగ విషయాలను రూపొందించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యతిరేకించకుండా ఆయన మధ్యేమార్గంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు ఆయన కాంగ్రెసు రాజకీయ వ్యూహాలపై దాడి చేసే అవకాశాలున్నాయి.
తెలంగాణ నిర్ణయం వెనక కాంగ్రెసు రాజకీయ ప్రయోజనాలు ఆశించే తీరును ఆయన ఎండగట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెసు అధిష్టానం, యుపిఎ ప్రభుత్వం నమ్మకం కలిగించడంలో విఫలమైందని విమర్శించే అవకాశం ఉంది. ఇరు ప్రాంతాల ప్రజల పట్ల కాంగ్రెసు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో నరేంద్ర మోడీ చేసే ప్రసంగంపై ఇరు ప్రాంతాల ప్రజలకు మాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషకులకు ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications