సిఎంను అడిగారా? రాత్రికి రాత్రే కాదు: టిపై వెంకయ్య

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. రాష్ట్ర విభజనపై బిజెపి స్పష్టమైన వైఖరిని అఖిల పక్షంలో చెప్పిందన్నారు. విభజన నిర్ణయం సాధారణ విషయమేమీ కాదన్నారు. చారిత్రక అంశాన్ని పరిగణలోకి తీసుకోని నిర్ణయం తీసుకోవాలన్నారు. 1969లో తెలంగాణ, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయన్నారు. విభజన కోసం కేంద్రం ఎలాంటి కసరత్తు చేసిందో చెప్పాలన్నారు. 2004లో తెలంగాణపై నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఏం చేశారన్నారు.
ప్రణబ్, రోశయ్య కమిటీలపై ఏం నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. విభజన రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయం కాదని అంగీకరిస్తానని అయితే, ఇంత జరిగాక కూడా విభజన అంశం కాంగ్రెసు పార్టీ అంతర్గత విషయంగా భావిస్తున్నారని ఆరోపించారు. ఎపి రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. విభజనపై ముందో మాట చెప్పి, ఆ తర్వాత కమిటీ అంటున్నారన్నారు.
మీ ముఖ్యమంత్రి, మంత్రులను విశ్వాసంలోకి తీసుకోలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. వారి మీద మీకు విశ్వాసం లేదా అన్నారు. తెలంగాణ వచ్చాక ఆ ప్రాంత కాంగ్రెసు నేతలు మిఠాయిలు పంచుకుంటే, సీమాంధ్ర నేతలు వ్యతిరేకించారన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. విభజన చేసి కీర్తి అంతా కాంగ్రెసు మూట కట్టుకోవచ్చునని, అయితే అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది యువతను చంపవద్దన్నారు.
వాస్తవ పరిస్థితిని ప్రజలకు చెప్పాలన్నారు. ఇరు ప్రాంత కాంగ్రెసు నేతల భాష అత్యంత తీవ్రంగాను, విద్వేషపూరితంగాను ఉందన్నారు. రెచ్చగొట్టేలా కాంగ్రెసు నేతల వ్యాఖ్యలు ఉన్నాయని ఆక్షేపించారు. ఒక పార్టీలో రెండు రకాల అభిప్రాయాలను తాము అంగీకరిస్తామని అయితే, ఇది ఎంతకాలమన్నారు. పార్టీలో ఏకాభిప్రాయానికి తొమ్మిదేళ్లు కూడా సరిపోలేదా అన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు భారత దేశంలో ఓ భాగమని గుర్తుంచుకోవాలన్నారు. విభజన సమస్యను భారత్ - పాక్ సమస్యగా చూస్తున్నారని మండిపడ్డారు.
పదేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయాయన్నారు. నదీ జలాల పంపిణీ పైన ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. నదీ జలాల పంపిణీ అనేది అత్యంత ముఖ్యమైన విషయమన్నారు. మౌలిక అంశాలపై చర్చించకుండా విభజన నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారిందని, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో భవిష్యత్తు పైన ఆందోళనలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంకా ఎన్ని రోజులు సాగదిస్తారని ప్రశ్నించారు.
అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న మీరు మీ పార్టీ అభిప్రాయం చెప్పాలన్నారు. సిద్ధాంతపరంగా రెండు రాష్ట్ర రాష్ట్రాలు అనే మాటకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు సకల జనుల సమ్మె తెలంగాణ ప్రాంతంలో జరిగిందని, ఈ రోజు రాత్రి నుండి ఎపిఎన్జీవోలు అదే తరహా సమ్మెకు సిద్ధమయ్యారన్నారు. విభజన అంశంపై పరిణితితో కూడిన రాజకీయ వ్యవహారం చేయలేరా అని ప్రశ్నించారు.
తెలంగాణతో...: బిపిఎఫ్
తెలంగాణపై నిర్ణయంతో చిన్న రాష్ట్రాల డిమాండుకు ప్రాతిపదిక దొరికిందని అస్సాంలోని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎంపి బిస్వజిత్ దాల్మనీ అన్నారు. 2003 నుండి తెలంగాణను పరిశీలిస్తున్నారని, ఇప్పటికీ స్పష్టమైన మార్గసూచి లేదన్నారు. బోడోలాండ్ సహా ఇతర రాష్ట్రాల డిమాండ్లు కూడా న్యాయసమ్మతమైనవే అన్నారు. చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తే ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications