చిత్రాలు: భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలు
హైదరాబాద్: రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతోంది. దానికి తోడు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతున్నాయి. సూర్యాపేటలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. హుజూర్నగర్, మిర్యాలగుడా, నల్లగొండ వంటి ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నివాస ప్రాంతాల్లోకి కూడా నీళ్లు వచ్చి చేరాయి. కర్నూలు జిల్లాను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా రాయపాడు గ్రామం కుందూ నది వరదతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. గగ్గుటూరు వైపు రహదారిపై పెద్ద యెత్తున నీరు చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి.

నీటి ప్రవాహం
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. నంద్యాల పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కుందూనది, రాళ్లవాగు, మద్దెలవాగులు పొంగి పొర్లుతున్నాయి.

భారీ వర్షాలు
ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం శనివారం ఉదయం 42.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

వ్యక్తులు గల్లంతు
వరగంల్ జిల్లా తొర్రూరు పెద్దచెరువు అలుగు దుముకుతుండడంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

రాకపోకలు స్తంభన
ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు వంతెనపై నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో 29 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఖమ్మం జిల్లాలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.












Click it and Unblock the Notifications