కిరణ్ అనుకుంటే..: కెటిఆర్, బిఆర్కె భవన్లో ఉద్రిక్తత
నష్టం లేదు: గండ్ర
అభద్రతా భావంతో కాంగ్రెసు పార్టీని వీడే వారితో నష్టం లేదని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ముగ్గురు సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తున్న విషయమై ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. హైదరాబాదులో అభద్రతా భావం ఉంటుందన్న ప్రచారం సరికాదన్నారు.
ఉద్యమాల ప్రభావం లేదు: పొన్నాల
ఉద్యమాల ప్రభావం పారిశ్రామిక రంగం పైన పడలేదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పెట్టుబడులు వస్తున్నాయని, ఇవే ఉద్యమాల ప్రభావం పరిశ్రమలపై లేదనేందుకు నిదర్శనమన్నారు. కొత్త పరిశ్రమలు హైదరాబాదుకు వస్తున్నాయని, దక్షిణాఫ్రికా ప్రతినిధులు ఈ రోజు కలిశారన్నారు.
శాంతియుతంగా నిరసన చేయవచ్చు: సిపి
నిరసనలు శాంతియుతంగా వ్యక్తం చేయాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ఆందోళనలు చేయవద్దని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి ఆందోళన చేస్తే ఊరుకునేది లేదన్నారు.
బిఆర్కె భవన్లో ఉద్రిక్తత
విభజన నిర్ణయం నేపథ్యంలో హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు చల్లారలేదు. మంగళవారం బిఆర్కె భవనంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటా పోటీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.