సజ్జనార్ సార్ మార్క్: ట్వీట్ చేస్తే చాలు బస్సు సర్వీస్.. ఏళ్లుగా రానీ చోటకు కూడా
ఆర్టీసీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. ఒక్కో కీలక అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏళ్లుగా జరగని పనులను చకచకా చేస్తున్నారు.ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. మంచి ఆదాయమే సమకూరింది. ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులను పెళ్లి కోసం బుక్ చేసుకుంటే గిప్టులను అందజేస్తున్నారు.
30 ఏళ్లుగా లేని సర్వీస్
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటకు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్, చామనపల్లికి చెందిన జాజిమొగ్గ గణేశ్ కోనంపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని నవంబర్ 12న ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశారు. స్పందించిన ఎండీ మంచిర్యాల ఆర్టీసీ డీఎం మల్లేశయ్యను ఆదేశించడంతో నవంబర్ 16 నుంచి బస్సు ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డీఎం, డ్రైవర్, కండక్టర్ను శాలువాలతో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నెన్నెల, మైలారం, కుశ్నపల్లి గ్రామాలకు ఏడాదిగా బస్సు నిలిచిపోయింది. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు గమనించిన ప్రవాస భారతీయుడు వెంకట కృష్ణారెడ్డి అక్టోబర్ 21న ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలకు బస్సు పునఃప్రారంభమైంది.
మారుమూల ప్రాంతాలకు సర్వీస్
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా జిల్లా కేంద్రం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి తాంసి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక.. ప్రైవేటు వాహనాలు సమయానికి రాక విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యేవారు. మండల కేంద్రానికి చెందిన దారవేణి రాఘవేంద్ర నవంబర్ 22న ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశాడు.
Recommended Video
చదువు ఆపేసి
తాంసికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే అవకాశం ఉందని, బస్సు ప్రారంభించాలని కోరాడు. రెండు గంటల వ్యవధిలోనే స్పందించిన ఎండీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత నెల 25 నుంచి తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి వెళ్లే బస్సును తాంసి మండల కేంద్రం మీదుగా ఉదయం, సాయంత్రం నడిపిస్తున్నారు. మండల కేంద్రానికి ప్రత్యేకంగా బస్సు నడిపితే బాగుంటుందని మండల వాసులు, విద్యార్థులు కోరుతున్నారు.కుమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చుట్టూ దట్టమైన అడవి, కొండల మధ్య ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంగి గ్రామానికి 26 ఏళ్లకు ఆర్టీసీ బస్సు వచ్చింది. 'పోలీసులు మీ కోసం' కార్యక్రమంలో భాగంగా ఎస్సై రామారావు మూడు కిలోమీటర్ల మేర కంకర తేలిన రహదారిపై గ్రామస్తుల సహకారంతో దాదాపు 400 ట్రిప్పుల మొరం పోయించి వాహనాల రాకపోకలకు అనువుగా మార్చారు. సమస్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి బస్సు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర బస్సు ప్రారంభించారు.