బతికామో..చచ్చామో చూడ్డానికా : జనవరి 1న ఏపిలో టిడిపి నిరసనలు : బాబు టార్గెట్ మోదీ..!
Recommended Video
ప్రధాని మోదీ లక్ష్యంగా రాజకీయంగా పావులు కదుపుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సంవత్సరం మొదటి రోజున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. జనవరి 6న ప్రధాని మోదీ ఏపికి రానున్నారు. ఆయన రాక పై సీయం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు..బతికాయో - చచ్చమో చూడ్డానికా అంటూ నిల దీసారు. రాష్ట్ర వ్యాప్తంగా 1న నిరసన ర్యాలీలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
కేంద్ర వైఖరి పై ఇప్పటి వరకు విమర్శలు..దీక్షల కు పరిమితమైన ఏపి అధికార పార్టీ టిడిపి ఇప్పుడు నిరసనల బాట పడుతోంది. ఇందు కోసం నూతన సంవత్సరం మొదటి రోజు ముహూర్తంగా ఎంచుకున్నారు. కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు జనవరి 1న రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాష్ట్రానికి న్యాయం జరిగేటంత వరకు మనకు పండుగల్లేవు. అందుకే జనవరి 1న భారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు.ఒకరు తప్పు చేస్తే వాటిని బయట పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడమే ప్రజాస్వామ్యం. ఎవర్నీ అవమానించడం, హింసాత్మక కార్యక్రమాలు చేయడం మన అభిమతం కాదు. అదే సమయంలో హక్కులను వదిలి పెట్టం.
మోదీ ది నెగటివ్ క్యారెక్టర్, ప్రధాని అభ్యర్ధిగా ఎవర్నీ నిర్ణయించలేదు
ఏటా మహా సంకల్పం, నవనిర్మాణ దీక్షలు అందుకే చేస్తున్నా మని వివరించారు. ఇది మన ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. మోసం చేశారని గమ్మున ఉంటే జీవితాంతం మోసం చేస్తారా.. నిర్లక్ష్యం చేస్తే విడచిపెట్టరు అన్న భావన వాళ్లలో కలిగితేనే మనకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ పోరాటమని ముఖ్యమంత్రి వివరించారు.
బతికామో..చచ్చామో చాడ్డానికా..
ప్రధాని ఏపి పర్యటన పైనా ముఖ్యమంత్రి గట్టిగానే స్పందించారు. రాష్ట్రానికి నాలుగున్నరేళ్లుగా ఏమీ చెయ్యకుండా, ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఇప్పుడు బతికామో, చచ్చామో చూడటానికి వస్తారా అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలన్నీ భాజపాని నిలదీయాలని పిలుపు నిచ్చారు. ప్రజల్లో దోషిగా నిలబెట్టాలి. ఆ పార్టీకి సహకరించేలా కుట్రపన్నిన వాళ్లనూ దోషిగా నిలబెట్టాలి.
రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీ ఇక్కడికి వస్తుంటే మిగతా రాజకీయపార్టీలు ఎందుకు మాట్లాడవని నిలదీసారు. మీ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా అంటూ వైసిపి ని పరోక్షంగా ప్రశ్నించారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఐటీ ఇంజినీర్లు ఉన్నారు. గుజరాత్ నుంచి ఎవరైనా ఉన్నారా..పన్నెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రానికి ఏం చేశారు. ఈ రోజు గుజరాత్ని హైదరాబాద్తో పోల్చగలమా..తలసరి ఆదాయంలో ఆ రాష్ట్రం కంటే తెలంగాణ ముందుంది. కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ని దాటిపోతుందని సీయం ధీమా వ్యక్తం చేసారు.