ఏపీకి కేంద్రం మరో వరం- అమిత్ షాతో సాయిరెడ్డి కీలక భేటీ
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి ఇవ్వాళ ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
అమరావతి: ప్రస్తుతం మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలు ప్రస్తావనకు వస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి- రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సభలో ప్రస్తావించారు ఇవ్వాళ. ఏపీ ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్లో మౌలిక వసతులను కల్పించడానికి 1,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
దీనికి ఆమోదం తెలిపినట్లు రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. 1,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ నిధుల సహాయంతో బల్క్ డ్రగ్ పార్క్లో మౌలిక వసతుల కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూరకంగా జవాబిచ్చారు.

దేశంలో బల్క్ డ్రగ్ పార్క్ల ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఖుబా వివరించారు. విశాఖపట్నంలో ఎయిర్ కార్గో టెర్మినల్, పోర్టులో కంటైనర్ టెర్మినల్ వంటి రవాణా వసతులు సిద్ధంగా ఉన్నందున ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడానికి ఏపీలో మరిన్ని బల్క్ డ్రగ్ పార్క్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అంటూ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నికు మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా దేశీయ వినియోగంతోపాటు, ఎగుమతులకు అవసరమైన మందుల తయారీకి అనువైన వాతావరణ పరిస్థితుల కల్పనే ఈ పథకం ఉద్దేశమని ఖుబా తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తోన్న కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కోసం తన వాటా కింద 72 కోట్ల రూపాయలను భరిస్తామని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలలో కేన్సర్ ఇన్ స్టిట్యూట్లను నెలకొల్పనున్నామని, ఇందులో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర స్థాయి కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సాయంత్రం విజయసాయి రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను సకాలంలో మంజూరు చేయించాలని కోరారు. సత్వరంగా విడుదల చేయడం వల్ల ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలు సకాలంలో పూర్తవుతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications