టీడీపీ కంచుకోటలో అసమ్మతి సెగ
Kalyandurg Assembly round up: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటోన్నాయి. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తరువాత ఇక్కడి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. టీడీపీకి ప్రతికూలంగా తయారయ్యాయి.
అనంతపురం లోక్సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు.. కల్యాణదుర్గం. కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. బ్రహ్మసముద్రం, కల్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 2,19,591 మంది ఓటర్లు ఉన్నారిక్కడ. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా అయిదుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. నాలుగుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది.

వెనుకబడిన సామాజిక వర్గీయుల ఓటుబ్యాంకు అధికంగా ఉండే నియోజకవర్గం ఇది. అనంతరం ఎస్సీ ఓటర్ల సంఖ్య భారీగా ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గీయులు, బోయ, వాల్మీకీ కులస్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటారు. కాంగ్రెస్ తరఫున ఎం లక్ష్మీదేవి, టీడీపీ అభ్యర్థిగా బీసీ గోవిందప్ప, ఇండిపెండెంట్, టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు టీసీ మారెప్ప మినహా మరెవరూ కూడా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం ఈ నియోజకవర్గం ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది ఈ నియోజకవర్గంలో. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఉష శ్రీచరణ్ గెలిచారు. టీడీపీకి చెందిన మాదినేని ఉమా మహేశ్వర నాయుడిపై ఘటన విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా బెర్త్ సాధించారు.
ఈ సారి ఎన్నికల్లో అటు ఉష శ్రీచరణ్ గానీ, మాదినేని ఉమా మహేశ్వర నాయుడు గానీ పోటీ చేయట్లేదు. ఉషా శ్రీచరణ్కు పెనుకొండ అసెంబ్లీ బరిలో దించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెనుకొండ నుంచి పోటీ చేస్తోన్నారామె. ప్రస్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి శంకరనారాయణను అనంతపురం లోక్సభ అభ్యర్థిగా పంపించారు.
ఉమా మహేశ్వర నాయుడికి టికెట్ ఇవ్వలేదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమిలినేని సురేందర్ బాబును రేసులో నిలబెట్టారు. ఈ టికెట్ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి గానీ, ఉమా మహేశ్వర నాయుడికి గానీ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడం, కాంట్రాక్టర్ సురేందర్ బాబును బరిలో దించడం టీడీపీలో అసంతృప్తికి కారణమైంది.












Click it and Unblock the Notifications