విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్న సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘ విరామం తరువాత అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారు. శింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలలో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ప్రస్తుతం రాజకీయంగా అనంతపురం జిల్లా కీలకంగా మారింది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని రెండు స్థానాలు మినహా అన్నింటా వైసీపీ విజయం సాధించింది. నార్పలలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగనన్న వసతి దీవెన నిధులను విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన జరగాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆర్దిక శాఖ అధికారుల సూచన మేరకు పర్యటన వాయిదా పడినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటన వెనుక కారణాలపైన జరుగుతున్న ప్రచారానికి స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ఈ నెల 26న జరిగే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో తదుపరి విడత నిధుల జమ చేయనున్నారు. ముందుగానే ఈ ఆర్దిక సంవత్సరంలో ఏ నెలలో ఏ పథకం అమలు చేసేదీ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటన చేసారు. ఆ విధంగానే ఇప్పుడు పధకాల అమలు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన పైన జిల్లా కలెక్టర్ తో పాటుగా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వసతి దీవెన పథకానికి పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో చదివేవారు అర్హులు. డే స్కాలర్, కాలేజ్ అటాచ్ హాస్టల్స్, డిపార్ట్మెంట్ అటాచ్ హాస్టల్స్లో ఉండే విద్యార్థులకు అవకాశం ఉంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఇక, రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో కీలకమైన అనంతపురం జిల్లా వేదికగా సీఎం జగన్ ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ తొలి సారిగా రాయలసీమ ప్రాంతానికి వస్తున్నారు. దీంతో, రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ కీలక అంశాలను ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications