అనంతపురంలో గప్పుమన్న డ్రగ్స్.. కొకైన్ స్వాధీనం
డ్రగ్స్.. గంజాయి, కొకైన్.. టైర్-2 నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో యువత మత్తులో జోగుతున్నారు. ఆడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నా.. గంజాయి మాత్రం పట్టుబడుతూనే ఉంది. అనంతపురం జిల్లాలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతల్లు రైల్వే పార్సిల్ ఆఫీస్ వద్ద నిందితులు డ్రగ్స్ పంచుకుంటూ ఉండగా పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీంతో కలకలం నెలకొంది.
డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉందని పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందని చెప్పారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లయ్ చేసే నిందితులు.. గుంతకల్లులో ఎందుకు దిగారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
మరోవైపు పరారైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితులు గోవాలో గ్రాము కొకైన్ రూ.5వేలకు కొని హైదరాబాద్ లో రూ.15వేలకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. ఈజీ మనీ కోసం అలా చేస్తున్నారు. కానీ యువత జీవితాలను మాత్రం నాశనం చేస్తున్నారు. వారు మత్తులో మునిగి.. బంగారు జీవితాలను భవిష్యత్ లేకండా చేస్తున్నారు.