క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... జేసీ
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఈనేపథ్యంలోనే జేసీ వ్యాఖ్యలపై పోలీసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాను ఏ ఒక్క పోలీసు అధికారిని ఉద్దేశించి మాట్లాడలేదని, మొత్తం వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మాట్లాడానని జేసీ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారికి క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు జేసీ.

వివాదంగా జేసీ వ్యాఖ్యలు
అనంతరం పార్టీ సమావేశంలో టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్టీ సమావేశంలో పోలీసులను ఉద్దేశించి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని, తాము అధికారంలో వచ్చిన తర్వాత బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అదికూడ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారాయి.

క్షమాపణకై పోలీసుల డిమాండ్
ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసులతో పాటు అనంతరం జిల్లా పోలీసులు ఘాటుగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బూట్లు ఎవరు నాకారన్న విషయం రాష్ట్ర ప్రజలకు కూడ తెలుసని జేసీ దివాకర్ రెడ్డి హోదా, వయస్సు మరచి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. మరోవైపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వేదికపై ఉండికూడ స్పందించలేదని అన్నారు. భవిష్యత్లో ఇలాంటీ వ్యాఖ్యలు చేస్తే... మరిన్ని దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారని పోలీసులు హెచ్చరించారు.

వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు కావు
అయితే దీనిపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి... తాను ఏ ఒక్క అధికారినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని... ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ఎలా ఉందో మాత్రమే చెప్పానని అన్నారు. పోలీసులు తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు వ్యవస్థ గాడి తప్పితే సమాజానికి చేటని ఆయన ఆక్షేపించారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని దివాకర్రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే...












Click it and Unblock the Notifications