కేసీఆర్, ఫడ్నవీస్ సహా..!: 29 సంతకాలు ఈజీ, టీడీపీ హితవు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఒక కోటి సంతకాల సేకరణ చేపడుతున్న విషయం తెలిసిందే. దీని పైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఆ పార్టీకి కౌంటర్ ఇస్తున్నాయి. కోటి సంతకాల సేకరణ కంటే 29 సంతకాల సేకరణ చాలా సులభమని సూచిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. దానికి బదులు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి వారి సంతకాలు పెట్టిస్తే సులభమవుతుందని సూచించారు. 29 రాష్ట్రాల సీఎంల సంతకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిస్తే ప్రత్యేక హోదా సులభమవుతుందంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మిగతా రాష్ట్రాలు అడ్డుపడుతున్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా సరికాదని చెబుతున్నాయి. అలా అయితే తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాకు బదులు.. నిధులు ఇచ్చే విషయమై టీడీపీ, బీజేపీలు ఆలోచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసమంటూ కోటి సంతకాల సేకరణ చేపట్టారు. దీనిపై అధికార పార్టీ భగ్గుమంటోంది. తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు... ఇలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతకాలు పెట్టించి తీసుకు రావాలని సూచిస్తున్నారు.