మంటల్లో వోల్వో బస్సు: 45 మంది సజీవదహనం
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద మంగంళవారం తెల్లవారు జాము ఘోర ప్రమాదం సంభవించింది. వోల్వో బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్రువీకరించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఒక్కసారిగా బస్సులో మంటలు లేవడంతో ప్రయాణికులు తేరుకునే లోపలే అనంతలోకాలకు వెళ్లిపోయారు. డ్రైవర్, క్లీనర్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సులో మొత్తం 51 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బస్సులో ఎంత మంది ఉన్నారనేది కచ్చితంగా లెక్క తేలడం లేదు.
బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్కు చెందిన వోల్వో(ఏపీ 02 ఏపీ 0963) బస్సు వంతెనను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరింగిందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సుల 51 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మెలుకువగా ఉన్న డ్రైవర్తో సహ ఆరుగురు ప్రమాదం నుంచి బయట పడినట్టు సమాచారం. 33 మంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారని అధికార వర్గాలు చెప్పాయి.
కల్వర్టును ఢీకొన్న వెంటనే బస్సు డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు దహనం అయినట్టు సమాచారం. డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంటలు లేవగానే కిందికి దూకడం ద్వారా డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు దక్కించుకున్నారు. హైదరాబాదుకు చెందిన పలువురు ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి 39 శవాలను వెలికి తీశారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు.
ప్రమాదానికి గురైన జబ్బర్ ట్రావెల్స్ వోల్వో బస్సులో ప్రయాణికుల వివరాలు కొన్ని - గాలి బాలసుందర్ రాజు, గాలి మేరీ విజయకుమారి (50), గౌరవ్ విక్రమ్ రాయ్, కిరణ్ (30), షోయబ్, అజహర్ (41), కృష్ణ (36), అడారి (27), జ్యోతి (33), ప్రశాంత్ గుప్తా (23), మొహిద్దీన్ (21), వేంకటేష్ దంపతులు ప్రయాణిస్తున్నారు. వెంకటేష్, షోయబ్ పేరుతో ఇద్దరిద్దరు చొప్పున ప్రయాణికులు ఉన్నారు. మిగిలినవారి వివరాలు తెలియాల్సి ఉంది.
చికిత్స పొందుతున్న యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కోర్టు న్యాయమూర్తి మోహనరావు కూతురు ప్రియాంక ఉన్నట్లు గుర్తించారు. క్షతాగాత్రులను 48 గంటలు పర్యవేక్షణలో ఉంచాల్సి ఉందని, ఆ తర్వాత గానీ వారి పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
కంట్రోల్ రూం నెంబర్లు- 9494600100, 08542 - 245927, 245930, 245932