ఎప్పటిలాగే దేవరగట్టులో పగిలిన తలలు: 40 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
అమరావతి: ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా కర్నూలు జిల్లా దేవరగట్టులో 3 గ్రామాల మధ్య బన్నీ ఉత్సవం ప్రారంభమైంది. 1300 మంది పోలీసుల బందోబస్తుగా ఏర్పాటు చేశారు. దేవుడిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి దేవాలయానికి చేరుకున్న మూడు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు దిగారు.
ఇనుప చువ్వలున్న కర్రలతో తలలు పగలగొట్టుకున్నారు. పోలీసులు బలగాలను భారీగా మోహరించినా హింసను మాత్రం ఆపలేకపోయారు. అయితే డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పడు పరిస్థితిని గమనిస్తున్నారు. దశాబ్దాలుగా ఆచారంతో పేరుతో కొనసాగుతున్న ఈ కర్రల సమరంలో మంగళవారం రాత్రి మొత్తం 40 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కాగడాల మంట అంటుకొని మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి చికిత్సనందించేందుకు వైద్యుల సదుపాయాన్ని కూడా అక్కడ సమకూర్చారు.
దసరా సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో గ్రామస్థుల కర్రల సమరం ఆనవాయితీగా వస్తోంది. ఈ కర్రల సమరాన్ని నిలిపేయమని పోలీసులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికి గ్రామస్ధులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. గతంలో కోర్టుు వరకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు కర్నాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మాలమల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఉత్సవం నిర్వహిస్తారు. దేవుడిని దర్శించుకునేందుకు 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు.