వారానికి ఐదు రోజులే: ఉద్యోగులకు ఏపీ సర్కార్ బంఫర్ ఆఫర్
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలివచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం ఓ వెసులుబాటు కల్పించింది. వారానికి ఐదు రోజులు పనిదినాల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంతో ఉద్యోగులకు వారంలో రెండు రోజుల సెలవు లభించనుంది.
సచివాలయ ఉద్యోగులు గత కొన్నాళ్లుగా 'ఐదు రోజుల పది దినాల' కోసం విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనివిధాలా చర్యలు చేపట్టిందని అన్నారు.
ఇందులో భాగంగానే జూన్ నాటికి అమరావతికి తరలివచ్చే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులపాటు పనిదినాలుగా ఏడాదిపాటు వెసులుబాటును సీఎం కల్పించారని తెలిపారు. దీంతో పాటు ఉద్యోగుల పిల్లలకు స్థానికతను వర్తింపజేయాలన్న విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కేంద్రానికి సీఎం లేఖ రాస్తారని మంత్రి వెల్లడించారు.

అయితే రాజధానికి వచ్చే ఉద్యోగులకు కార్యాలయాన్ని సమకూరుస్తున్నామని, ఇళ్లు మాత్రం వారే చూసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే జూన్ నాటికి తాత్కాలిక సచివాలయంలోని జీ ప్లస్ వన్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. దాని వల్ల 4,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
వీరిలో 2,200 మంది హైదరాబాద్ సచివాలయం నుంచి, మరో 2,300 మంది శాఖాధిపతుల కార్యాలయాల నుంచి వస్తారని పేర్కొన్నారు. జూలై చివరికి మరో 3,000 మంది, మిగిలినవారు ఆగస్టు చివరినాటికి చేరుకొంటారని తెలిపారు. జూన్ నాటికి హైదరాబాద్లోని సచివాలయ ఉద్యోగుల రాకతో నవ్యాంధ్ర రాజధానిలో నూటికి నూరుపాళ్లు పరిపాలన మొదలవుతుంది.
ఆగస్టులో సీఎం కార్యాలయం సిద్ధమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. వాస్తవానికి రాజధాని అమరావతిలో జూన్ నాటికి తాత్కాలికి సచివాలయానికి సంబంధించి రెండు ఫ్లోర్లను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆగస్టు నాటికి మరో రెండు ఫ్లోర్లను వేయాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీని కోసం రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications