ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: రికవరీ పెరిగింది, యాక్టివ్ కేసుల్లో తగ్గుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా ప్రతి రోజు 8వేలు లేదా అంతకంటే తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటం గమనార్హం.

ఏపీలో కొత్తగా 6190 కరోనా కేసులు..
గత 24 గంటల్లో 6,68,429 నమూనాలను పరీక్షించగా.. 6190 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 35 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,87,351కి చేరింది.

ఏపీ జిల్లాల వారీగా మరణాలు..
జిల్లాల వారీగా కరోనా మరణాలను గమనించినట్లయితే.. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 8 మంది, చిత్తూరు జిల్లాలో ఆరుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5780 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 276, చిత్తూరులో 784, తూర్పుగోదావరిలో 991, గుంటూరులో 410, కడపలో 299, కృష్ణాలో 398, కర్నూలులో 144, నెల్లూరులో 432, ప్రకాశంలో 569, శ్రీకాకుళంలో 377, విశాఖపట్నంలో 291, విజయనగరంలో 312, పశ్చిమగోదావరిలో 907 కేసులు నమోదయ్యాయి.

భారీగా తగ్గుతున్న యాక్టివ్ కేసులు
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 57,34,750 నమూనాలను పరీక్షించారు. తాజాగా, 9836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,22,136కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 59,435 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో క్రమంగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. ఒక సమయంలో లక్షకు చేరువైన యాక్టివ్ కేసులు ఇప్పుడు 60వేలకు చేరుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications