ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డుల జారీ-పట్టించిన ఏఐ టెక్నాలజీ- విజయవాడ పోలీసుల దర్యాప్తు...
ఏపీలోని విజయవాడలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సిమ్ కార్డుల జారీ కోసం టెలికాం సంస్దలు వివిధ ఐడీల్ని, అడ్రస్ ఫ్రూఫ్స్ ని తీసుకుని తీసుకుంటుంటాయి. కానీ విజయవాడలో మాత్రం ఓ వ్యక్తి నుంచి ఏం తీసుకున్నారో, ఎలా తీసుకున్నారో తెలియదు కానీ ఏకంగా 658 సిమ్ కార్డులు అతని పేరు మీద ఇచ్చేసిందో టెలికాం సంస్ధ. ఈ విషయం తాజాగా టెలీ కమ్యూనికేషన్ల శాఖ వాడుతున్న ఏఐ పరిజ్ఞానంతో బయటపడింది.
విజయవాడ నగరంలోని గుణదలలో ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (డాట్) ఫిర్యాదు మేరకు పోలీస్ కమిషనర్ కాంతిరాణా దీనిపై విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను ఆదేశించారు.వారి దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఫొటోతో ఓ టెలికాం సంస్థకు చెందిన 658 సిమ్ లను అమ్మినట్లు తేలింది.సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు.

ఇదే తరహాలో అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ అయినట్లు గుర్తించారు. కృత్రిమ మేధస్సుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలికమ్యునికేషన్ల శాఖ కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఓ టూల్ కిట్ వాడుతోంది. దీని పరిశీలనలో ఈ విషయం వెలుగుచూసింది. ఏఎన్టీఆర్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబైబర్ వెరిఫికేషన్) సాఫ్ట్వేర్ ద్వారా సిమ్ కార్డు మోసాలను గుర్తించి సంబంధిత నంబర్లను బ్లాక్ చేస్తోంది.

అన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్ కార్డుదారుల చిత్రాలను తీసుకుని ఇది వడపోస్తుంది. ఈ వడపోతలో భాగంగా ఒకే ఫొటోతో పెద్ద ఎత్తున సిమ్ లు తీసుకున్నట్లు బయటపడింది. నకిలీ పత్రాలతో జారీ అయిన సిమ్ కార్డులు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే విపరిణామాలు జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై విజయవాడ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సిమ్ లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు వినియోగిస్తున్నారు అనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి వుంది..












Click it and Unblock the Notifications